నవంబరు 30 ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే ఓటరు స్లిప్‌లను పంపిణీ దాదాపు పూర్తి చేశారు. ఈ స్లిప్‌లపై ఎలాంటి పార్టీ గుర్తులు, ఇతర సింబల్స్ ఉండటానికి వీల్లేదని అధికారులు చెబుతున్నారు. అలాంటివి ఉంటే మాత్రం పోలింగ్ కేంద్రంలోకి రానివ్వబోమని హెచ్చరిస్తున్నారు. వీటిని గుర్తింపు కార్డులుగా చూడబోమని.. ప్రత్యేక గుర్తింపు కార్డులు కూడా తమతో తీసుకురావాలని అధికారులు సూచించారు. 


ప్రభుత్వం జారీ చేసిన ఓటర్‌ ఐడీ చూపించవచ్చు. దాన్ని చూపిస్తే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటర్ స్లిప్స్ రానివాళ్లు బీఎల్వోను సంప్రదిస్తే చాలన్నారు. ఆన్‌లైన్‌లో కూడా పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు.


ఈ గుర్తింపు కార్డుల్లో ఏదైనా తీసుకొని వెళ్లొచ్చు.



  • ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్‌)

  • ఆధార్‌ కార్డు

  • పాసుపోర్టు      

  • డ్రైవింగ్‌ లైసెన్సు

  • కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్‌ సెక్టార్‌, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు

  • బ్యాంకులు, పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం (ఫొటోతో ఉన్నవి)

  • పాన్‌కార్డు

  • జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్‌కార్డు

  • ఎంఎన్‌ఆర్‌జీఏ జారీ చేసిన జాబ్‌కార్డు

  • కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు

  • ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు

  • ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం.


ఓటు వేసే టైంలో చేసే చిన్న తప్పులు కారణంగా ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి సెల్‌ఫోన్‌తో రావద్దని వస్తే చర్యలు ఉంటాయని అంటున్నారు. ఓటు వేసే టైంలో సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోలు దిగడం కూడా నేరమని అధికారులు చెబుతున్నారు. అలాంటి వారు శిక్షార్హులని వార్నింగ్ ఇస్తున్నారు. అలాంటి పని చేసిన ఓటర్‌ ఓటును 17-ఏలో నమోదు చేస్తారు. కౌంటింగ్ టైంలో ఆ ఓటును లెక్కలోకి తీసుకోరు. దివ్యాంగులకు సహాయం చేసిన వారు కూడా ఎవరికి ఓటు వేశారో బయటకి చెప్పకూడదు. 


మీ ఓటు వేరే వాళ్లు వేసి ఉంటే ఏం చేయాలి?
చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇది మనం చూస్తుంటాం. ఒకరికి బదులు మరొకరు ఓటు హక్కు వినియోగించుకొని ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలో చట్టంలో స్పష్టంగా ఉంది. సెక్షన్ 49 (పి) ప్రకారం ఎవరైనా మన ఓటు వేసి ఉంటే మళ్లీ పొందవచ్చు. 1961లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ముందుగా ఆ పేరు గల వ్యక్తివి నువ్వే అనే ఐడీ ప్రూఫ్‌లను ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి. ఆయన నిజంగానే మీ ఓటు వేరే వాళ్లు వేసేశారు అని నమ్మితే ప్రక్రియ ప్రారంభిస్తారు. 


ప్రిసైడింగ్ అధికారి ఫామ్ 17 (బి) ఇస్తారు. అందులో పేరు, సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తైతే టెండర్డ్ బ్యాలెట్ పేపర్‌ ఇస్తారు. అందులో మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి తిరిగి అధికారులకు ఇచ్చేయాల్సి ఉంటుంది. అధికారులు సూచించినట్టుగానే ఓటు వేయాల్సి ఉంటుంది. ఈవీఎం ద్వారా వేస్తామంటే మాత్రం వీలుపడదు. పోస్టల్ బ్యాలెట్‌ ద్వారానే ఓటు వేయాల్సి ఉంటుంది.