Patancheru News: పటాన్‌చెరు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం పీక్స్‌కు చేరింది. అధికార ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతూ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రచారం, అభ్యర్థుల ప్రకటన సజావుగానే సాగినా తన మార్క్‌ లాగులాటతో కాంగ్రెస్ సతమతమవుతోంది. అందుకే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. అయినా పంచాయితీలు మాత్రం తగ్గడం లేదు. మూడో జాబితా అర్థరాత్రి విడుదలైంది. కానీ తూర్పు తెల్లారేసరికి అసంతృప్తులు ప్రధాన నేతల ఇంటి ముందు గాంధీభవన్ ముందు ప్లకార్డులు పట్టుకొని గుడ్‌మార్నింగ్ చెప్పేశారు. 


మూడో జాబితాలో జాబితాలో చోటు దక్కలేదని తెలంగాణ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో రుసరుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డవారంతా రోడ్డు ఎక్కుతున్నారు. తమ అసంతృప్తిని అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. అధినాయకత్వంపైన, పీసీసీ చీఫ్‌పై విమర్శలు చేస్తున్నారు. నారాయణఖేడ్, పటాన్ చెరు, బోథ్, వనపర్తి, చెన్నూరు, పాలకుర్తి, డోర్నకల్, తుంగతుర్తి, సంగారెడ్డిలో ఆందోళనలు మిన్నంటాయి. పార్టీ కోసం కష్టపడిన తమను కాదని, కొత్తగా చేరిన వారికి సీట్లు కేటాయించడంతో నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. 


అందరికంటే పటాన్‌చెరు నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయంపై మాజీ మంత్రి దామోదర్ రాజనరసింహ గుర్రుగా ఉన్నారు. తన అనుచరుడైన కాటా శ్రీనివాస్‌ గౌడ్‌కు టికెట్‌ ఇవ్వకుండా నీలం మధుకు ఇవ్వడంపై మండిపడ్డారు. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌లో ఉన్న మధు ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్‌ గూటికి వచ్చారని గుర్తు చేశారు. మొదటి నుంచి పార్టీ బలోపేతానికి కష్టపడి ప్రజాసమస్యలపై పోరాడిన కాటా శ్రీనివాస్‌ గౌడ్‌కు టికెట్ నిరాకరించడంపై ఆయన సీరియస్ అయ్యారు. 


మరికాస్త ముందుకెళ్లిన దామోదర్ రాజనరసింహ రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే కలుగుచేసుకొని ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. ఠాక్రేతో కూడా దామోదర్‌ సీరియస్‌గా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇష్టం వచ్చిన వాళ్లకు టికెట్లు ఇస్తే రాజకీయాలు ఎలా చేయాలని ప్రశ్నించినట్టు ప్రచారం నడుస్తోంది. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఎలాంటి విపరీతమైన నిర్ణయాలు తీసుకోవద్దని వారించినట్టు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. 
 
పటాన్ చెరు టికెట్ తనకు రాలేదన్న కోపంతో ఈ ఉదయమే గాంధీ భవన్‌, రేవంత్‌ ఇంటి వద్ద తన కాటా శ్రీనివాస్‌ అనుచరులు హంగామా చేశారు. నిన్న కాక మొన్న చేరిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆవేశంతో రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టికెట్లు అమ్ముకుంటున్నారని విమర్శలు చేశారు. ఆగ్రహంతో ఊగిపోయిన కాటా శ్రీనివాస్ అనుచరులు.. గాంధీభవన్‌ వద్ద ఆందోళనకు దిగారు. పట్టణంలో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి పోస్టర్లు, బ్యానర్లను కాల్చేశారు. తొమ్మిదేళ్లుగా పార్టీకి సేవలందిస్తోన్న కాటా శ్రీనివాస్‌ను కాదని మధుకు ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నించారు. ప్రలోభాలకు లోనై టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. ఈ క్రమంలో రేవంత్ ఇంటి వద్ద నిరసన తెలపగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు రేవంత్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. శ్రీనివాస్ గౌడ్ అనుచరులను అరెస్ట్ చేశారు. 


పరిణామాలు గ్రహించిన అధినాయకత్వం పటాన్‌చెరు టికెట్ అంశంపై పునరాలోచనలో పడినట్టు సమాచారం అందుతోంది. ఇదే విషయాన్ని దామోదర్‌కు కూడా చెప్పారని ప్రచారం నడుస్తోంది.