తెలంగాణలో ఉదయం 7 గంటలకే అన్ని నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకే చాలా పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు క్యూ కట్టారు. ప్రముఖులు కూడా భారీగా తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందరూ ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. 


ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కును బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత"ముఖ్యంగా యువతీ యువకులు వచ్చి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు సెలవుదినం కాదు, ప్రజాస్వామ్యంలో పాల్గొని బలోపేతం చేసే రోజు. ఇప్పుడు కాస్త సౌండ్స్ ఎక్కువ ఉన్నాయేమో కానీ 2018లో కూడా ఇదే పరిస్థితి ఉండేది. కానీ ప్రజలు బీఆర్‌ఎస్‌కి మద్దతు ఇచ్చారు. ఈసారి కూడా ప్రజలు మాకు మద్దతు ఇస్తారని నేను నమ్ముతున్నాను. ప్రజల ప్రేమ  కేసీఆర్‌తో, ప్రజలపై ప్రేమ బీఆర్‌ఎస్‌తో ఉంది." అని అన్నారు. 






ఓటు వేసిన సినీ ప్రముఖులు
సినీ నటుడు అల్లు అర్జున్, ఎన్టీఆర్‌, కీరవాణి సహా మరికొందరు ప్రముఖులు వారి వారి ఫ్యామిలీలతో వచ్చి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.





ఓటు ప్రజాస్వామ్యానికి మంచిదని సామాన్యుడిగి బలమైన ఆయుధంగా ఉపయోగపడే ఓటు హక్కును అంతా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 






ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ డీజీపీ


తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు భద్రత కట్టుదిట్టం  చేశామని పేర్కొన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉందని ప్రజలకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో 70 వేల మంది పోలీస్ సిబ్బంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి హోంగార్డ్ సిబ్బంది, కేంద్ర బలగాలతో బందోబస్త్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తాను తన భార్య ఇద్దరం ఓటు హక్కు వినియోగించుకున్నామని మిగతా ప్రజలంతా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.


అంకెల్లో అభ్యర్థుల వివరాలు 


119 నియోజకవర్గాల్లో మొత్తం బరిలో ఉన్న అభ్యర్థులు - 2,290
పురుషులు - 2,068
మహిళా అభ్యర్థులు - 221
ట్రాన్స్‌జెండర్ - 1


మొత్తం ఓటర్లు - 3,26,18,205 మంది
పురుషులు - 1,62,98,418
మహిళలు - 1,63,01,705


మొత్తం బీఆర్ఎస్ పోటీ చేస్తున్న స్థానాలు - 119
బీఆర్ఎస్ అభ్యర్థులు - 118 (కేసీఆర్ రెండు చోట్ల)
ఎంఐఎం స్థానాలు - 9


మొత్తం కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాలు - 118
కాంగ్రెస్ అభ్యర్థులు - 117 (రేవంత్ రెడ్డి రెండు చోట్ల)
సీపీఐ - 1


మొత్తం బీజేపీ పోటీ చేస్తున్న స్థానాలు - 111
బీజేపీ అభ్యర్థులు - 110 (ఈటల రాజేందర్ రెండు చోట్ల నుంచి)
జనసేన స్థానాలు - 8


బీఎస్పీ పోటీ చేస్తున్న స్థానాలు - 107
అభ్యర్థులు - 107
సీపీఎం పోటీ చేస్తున్న స్థానాలు - 19