Andhra Pradesh News: టీడీపీ విడుదల చేసిన లాస్ట్ లిస్ట్‌తో చాలా నియోజకవర్గాల్లో సస్పెన్స్‌కు తెరపడినట్టు అయింది. అయితే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో కొత్త సమస్య వచ్చి పడింది. ఇప్పటి వరకు ఉన్న గ్రూపుల గోల మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 


ఇప్పటి వరకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇద్దరు సీనియర్ నేతలు టికెట్ కోసం పోటీ పడ్డారు. కళా వెంకట్రావు ఒకవైపు, కలిశెట్టిఅప్పలనాయుడు ఇంతకాలం పోటీ పడ్డారు. చివరికి ఇప్పుడు ఆ స్థానం బీజేపీకి వెళ్లిపోయింది. వీళ్లంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇద్దరు నేతలు పూర్తిగా డీలాపడిపోయారు. అయితే అధినాయకత్వం వారికి మరో ఛాన్స్ ఇచ్చింది. 


ఎచ్చెర్ల టికెట్ ఆశించిన కలిశెట్టి అప్పలనాయుడికి విజయనగరం ఎంపీ స్థానం ఇచ్చింది. చీపురుపల్లి నుంచి కళావెంకట్రావుకు ఛాన్స్‌ ఇచ్చింది. ఒకే స్థానం కోసం పోటీ పడుతున్న ఇరు వర్గాలకు రెండు వేర్వేరు స్థానాలు ఇచ్చి ఇద్దరూ కలిసి పని చేసేలా ప్లాన్ చేసింది. ఈ ఇద్దరు తూర్పుకాపునేతలు ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం కోసం గత కొంత కాలంగా ఒకే పార్టీలో ప్రత్యర్థులుగా మారారు. ఇప్పుడు ఇద్దరికీ విజయనగరం జిల్లాతో ముడిపడి ఉన్న స్థానాలు కేటాయించడంతో ఒకరి కోసం మరొకరు పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


చిపురుపల్లిలో బొత్సపై వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడ ఇంచార్జ్‌గా ఉన్న కళావెంకట్రావు తమ్ముడు దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నాడని భావించి కళా వెంకట్రావును అక్కడకు పంపించారు. వీళ్లు ఒకే ఫ్యామిలీ మెంబర్స్ కావడంతో సమన్వయం కూడా ఉంటుందని అధినాయకత్వం ఆలోచన. చీపురుపల్లి నియోజకవర్గంలో కిమిడి నాగార్జునకి ఇస్తారు అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో కళా వెంకట్రావు పేరు రావడంతో స్థానిక నాయకత్వం కొంత వ్యతిరేకంగా ఉంది.ఎచ్చెర్లలో ఉంటున్న అభ్యర్థికి చీపురుపల్లి సీటు ఎలా ఇస్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నాగార్జునతోపాటు అనుచరులు టీడీపీకి రాజీనామా చేశారు. స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇది కళాకు కాస్త తలనొప్పి వ్యవహారంగానే కనిపిస్తోంది. 


విజయనగరం ఎంపిగా కలిశెట్టి అప్పలనాయుడుకి అధినేత చంద్రబాబు అవకాశం కల్పించడంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు. కిమిడి కళా వెంకట్రావుకు చీపురుపల్లి కేటాయించడంపై ఆయన వర్గీయుల్లో నిరాశ కనిపిస్తోంది. మొదట విజయనగరం పార్లమెంట్ స్థానం కళా పేరునే పరిశీలించింది. అయితే ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మీసాలగీత, కంది చంద్రశేఖర్, కలిశెట్టి అప్పలనాయుడు పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. చివరకు అప్పలనాయుడుని ఖరారు చేశారు. చీపురుపల్లి స్థానానికి కూడా గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావును పరిశీలించారు. చివరకు కళా వెంకటరావుకి కేటాయించారు. 


అప్పలనాయడు విషయంలో ఎలాంటి వ్యతిరేకత కనిపించకపోయినప్పటికీ కళావెంకట్రావు విషయంలో కనిపిస్తున్న వ్యతిరేకతను అధినాయకత్వం ఎలా సెట్ చేస్తుందో అన్నఆసక్తి కనిపిస్తోంది.