Andhra Pradesh News: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలకు అభ్యర్థులను అధికార వైసీపీ, కూటమి ఖరారు చేశాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 స్థానాలకు ఇటు వైసీపీ, అటు కూటమి అభ్యర్థులను ఖరారు చేయడంతో పోటీ ఆసక్తిని రేపుతోంది. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పది స్థానాలను కైవసం చేసుకుని క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈసారి కూడా అదే విధమైన ఫలితాలను తెచ్చే దిశగా ఆ పార్టీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఇటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో కూడిన కూటమి కూడా మెజార్టీ స్థానాలను ఈ జిల్లాలో కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. సామాజిక సమీకరణాలు, ఆర్థిక, అంగ బలం వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే వైసీపీ, కూటమి అభ్యర్థులను ఎంపిక చేశాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా మొహమాటాలకు తావు లేకుండా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ జిల్లాలో అభ్యర్థులను ప్రకటించారు. 

పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్లే

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పది స్థానాలు ఇరు వైపుల నుంచి అభ్యర్థులు ఖరారు కావడంతో పోటీపై స్పష్టత వచ్చింది. పార్వతీపురం(Parvathipuram ) నుంచి మరోసారి అలజంగి జోగారావు(Alajangi Joga Rao )కు అధికార వైసీపీ అవకాశం కల్పించింది. సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న జోగారావు మరోసారి బరిలోకి దిగుతుండగా, తెలుగుదేశం పార్టీ నుంచి బోనెల విజయ్‌ చంద్ర(Bonela Vijay Chandra )ను పోటీ చేస్తున్నారు. ఈయన తొలిసారి పోటీ చేస్తున్నారు. ఆర్థికంగా బలమైన నేత కావడంతో ఈయనకు అవకాశం కల్పించినట్టు చెబుతున్నారు. బొబ్బిలి (Bobbili నియోజకవర్గం నుంచి వైసీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే వెంకట చిన అప్పలనాయుడు(venkata Chinna Appalanaidu )కు మరోసారి అవకాశం ఇచ్చింది. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఆర్‌ఎస్‌వీకేకే రంగారావు(బేబీ నాయన)(RSVKK Ranga Rao (Baby Nayana) పోటీ చేస్తున్నారు. గతంలో ఈయన బొబ్బిలి మున్సిపల్‌ చైర్మన్‌గా పని చేశారు. వైసీపీ నుంచి 2014లో విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈయన సోదారుడు సుజయ్‌ కృష్ణ రంగరావు గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. 2014లో వైసీపీ నుంచి ఎన్నికైన సుజయ్‌ ఆ తరువాత టీడీపీలో చేరి మంత్రిగా కూడా పని చేశారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడ పోటీ ఆసక్తిని కలిగిస్తోంది. 

 

అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు వీళ్లే 

నియోజకవర్గం  వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి
పార్వతీపురం అలజంగి జోగారావు బోనెల విజయ్‌ చంద్ర(టీడీపీ)
బొబ్బిలి వెంకట చిన అప్పలనాయుడు ఆర్‌ఎస్‌వీకేకే రంగారావు(బేబీ నాయన)(టీడీపీ)

సాలూరు(Saluru) నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి పీడిక రాజన్నదొర(Pidika Rajannadora) పోటీ చేస్తున్నారు. వరుస విజయాలతో ఊపు మీదున్న రాజన్న దొర మరోసారి విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి(Gummadi Sandhyarani) పోటీ చేస్తున్నారు. విజయనగరం(Vizianagaram) అసెంబ్లీ స్థానం నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి(Kolagatla Veerabhadraswamy) పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి అదితి గజపతిరాజు(Aditi Gajapathiraju) బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ పడగా, అదితి ఓటమి పాలయ్యారు. ఈమె తండ్రి అశోక్‌ గజపతిరాజు గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎంపికయ్యారు. కేంద్ర మంత్రిగానూ పని చేశారు. విజయనగరం జిల్లాలో అత్యంత ఆసక్తిని రేపుతున్న పోటీ ఈ నియోజకవర్గంగా చెప్పవచ్చు. శృంగవరపుకోట (Sringavarapukota) నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు(Kadubandi Srinivasa Rao)ను ఆ పార్టీ బరిలోకి దించుతోంది. కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి(Kolla Lalitha Kumari) పోటీ చేస్తున్నారు. 

అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు వీళ్లే 

నియోజకవర్గం  వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి
సాలూరు పీడిక రాజన్నదొర గుమ్మడి సంధ్యారాణి(టీడీపీ)
విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి అదితి గజపతిరాజు(టీడీపీ)
శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు కోళ్ల లలిత కుమారి(టీడీపీ)

ఈ జిల్లాలో మరో కీలక నియోజకవర్గం చీపురుపల్లి(Chipurupalli). రాష్ట్ర స్థాయిలో ఈ నియోజకవర్గంలో జరుగుతున్న పోటీ ఆసక్తిని రేపుతోంది. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్‌ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మరోసార పోటీ చేస్తున్నారు. ఈయనపై కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత కిమిడి కళా వెంకటరావు(Kimidi Kala Venkata Rao) పోటీ చేస్తున్నారు. గజపతినగరం (Gajapatinagar) నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న బొత్స అప్పలనర్సయ్య(Botsa Appalanarsaiah) పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి కొండపల్లి శ్రీనివాస్‌ (Kondapalli Srinivas)అనే కొత్త అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కురుపాం(Kurupam ) నియోజకవర్గం నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పాముల పుష్ఫ శ్రీవాణి(Pamula Pusha Shrivani ) పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన తొయ్యక జగదీశ్వరి(Jagadeeswari) పోటీ చేస్తున్నారు. నెల్లిమర్ల(Nellimarla) నుంచి వైసీపీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు(Baddukonda Appalanaidu) పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా జనసేనకు చెందిన లోకం మాధవి(Lokam Madhavi ) బరిలోకి దిగుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ కొన్ని స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించగా, అధికార వైసీపీ మాత్రం గత ఎన్నికల్లో విజయం సాధించిన వారితోనే ఎన్నికల క్షేత్రానికి వెళుతోంది. చూడాలి మరి వీరిలో ఎవరు గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారో. 

అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు వీళ్లే 

నియోజకవర్గం  వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి
చీపురుపల్లి బొత్స సత్యనారాయణ కిమిడి కళా వెంకటరావు(టీడీపీ)
గజపతినగరం

బొత్స అప్పలనర్సయ్య

కొండపల్లి శ్రీనివాస్‌(టీడీపీ)

కురుపాం

పాముల పుష్ఫ శ్రీవాణి

తొయ్యక జగదీశ్వరి(టీడీపీ)

నెల్లిమర్ల బడ్డుకొండ అప్పలనాయుడు లోకం మాధవి(జనసేన)