YSRCP Elections Campaign : వైసీపీ అధినేత జగన్ పర్యటనలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్‌ను కలిసి రైతుల సమస్యలు చెబుతానంటూ బయల్దేరిన మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు అడ్డుకున్నారు. బస్సు యాత్ర ఎర్రగుంట్ల వద్ద ఉన్నప్పుడు అటుగా వచ్చారు అఖిలప్రియ. స్థానిక అంశాలపై ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇస్తానంటూ వచ్చారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు రైతులతో కలిసి వచ్చిన అఖిలప్రియను పోలీసులు అడ్డుకున్నారు. 


జగన్‌ను కలిసేందుకు వచ్చిన తనను అడ్డకోవడంపై అఖిల ప్రియ ఫైర్ అయ్యారు. ముందుగానే ఎస్పీ వద్ద పర్మిషన్ తీసుకున్నామని ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. సమస్యలు ఉంటే చెప్పండి అని జగన్ అంటూ ఉంటే... పోలీసులు మాత్రం తమను వెళ్లనీయకపోవడంపై మండిపడ్డారు. 
జగన్‌ను కలిసేందుకు అనుమతి లేదంటూ సభా ప్రాంగణానికి దూరంలోనే నిలిపివేసిన పోలీసులు అఖిల ప్రియతో చర్చలు జరిపారు. కేవలం నలుగురిని మాత్రమే అనుమతి ఇస్తామంటూ చెప్పారు. అలా నలుగురి వివరాలు తీసుకొని సీఎంను కలిసేందుకు వెళ్లారు. 


అక్కడ మరో డ్రామా నడిచిందని అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పేందుకు వెళ్లిన రైతులను స్థఆనిక ఎమ్మెల్యే అనుచరులు కొట్టి పంపిచారని ఆరోపించారు. తాము కచ్చితంగా సీఎంను కలిసి వెళ్లాల్సిందేనంటూ భీష్మించుకొని కూర్చున్నారు. పరిస్థితి చేయిదాటిపోకుండా పోలీసులు ముందుగా ఆమెను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అఖిలప్రియను సిరివెళ్ల పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. 




సమస్యలు విన్న వించుకోవడానికి వెళ్లిన రైతులపై దాటి చేసిన ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని అఖిల ప్రియ డిమాండ్ చేశారు. తర్వాత తనపై కేసు పెట్టుకోవాలన్నారు. అలా కాదని  తన పైన మాత్రమే కేసు నమోదు చేస్తే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులకు హెచ్చరించారు.