Andhra Pradesh News: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు పూర్తైనట్టు సమాచారం. ఒకట్రెండు చోట్ల మినహా మిగిలిన పెండింగ్ జాబితాపై పూర్తి క్లారిటీ వచ్చినట్టు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆ లిస్ట్ విడుదల చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. 23 తేదీని ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు ఓ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఆ లోపు పెండింగ్ అ‌భ్యర్థులపై స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నారట. 


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా 52 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా 128 మంది ఎమ్మల్యే అభ్యర్థులను ప్రకటించారు. కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 144 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. అంటే ఇంకా 16 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 


16 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు ఎంపీ అభ్యర్థుల లిస్ట్ కూడా సిద్ధం చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో పదిమందికిపై అభ్యర్థులకు పోటీపై క్లారిటీ ఇచ్చేశారు. వాళ్లు కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రజల్లోకి వెళ్లిప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై కూడా అధికారిక ప్రకటన రెండు రోజుల్లో ఉంటుందని అంటున్నారు.