South Costal: ఆది నుంచి వైసీపీ(YCP)కి పట్టున్న జిల్లాలపై టీడీపీ కన్నేసింది. గత ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాలో స్పెషల్ ఫోకస్ పెట్టింది. కీలక నేతలను పార్టీలోకి చేర్చుకొని అధికార పార్టీకి దెబ్బకొట్టాలని భావిస్తోంది. పోయేవాళ్లు పోని ఉన్న వాళ్లు ఏం తక్కువ కాదని వారినే బరిలో దింపి సై అంటోంది ఫ్యాన్‌ పక్షం దీంతో ఇక్కడ రాజీకయం ఆసక్తిగా మారింది. 


నెల్లూరులో నిలదొక్కుకునేదెవరో..?
నెల్లూరు జిల్లా తొలి నుంచి కాంగ్రెస్‌(Congress)పార్టీకి కంచుకోట...వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆ కోటను మరింత పటిష్ఠపరిచారు. ఆ తర్వాత వైసీపీ(YCP) ఆవిర్భావం తర్వాత మెజార్టీ సీట్లు ఆ పార్టీ ఖాతాలోపడుతూ వచ్చాయి. గత ఎన్నికల్లో అయితే ఏకంగా జిల్లా మొత్తం క్లీన్‌స్వీప్ చేసి నెల్లూరు (Nellore)జిల్లాపై జగన్ మరింత పట్టు సాధించారు. కానీ ఈసారి ఎన్నికలు దగ్గరపడేకొద్దీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జగన్(Jagan) సొంత మనుషులు అనుకున్నవారు ఒక్కొక్కరూగా ఆయనకు దూరం జరిగారు. జగన్ భక్తుడిగా పేరుగాంచిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(Kotamreddy Sridhar Reddy) తొలుత అసమ్మతిగళం వినిపించారు. మంత్రివర్గంలో చోటుదక్కకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు వ్యవహరించి క్రమంగా దూరమయ్యారు.


కోటం రెడ్డి వర్సెస్‌ ఆదాల 


ఈసారి ఎన్నికల్లో జగన్ టిక్కెట్ ఇవ్వడని ముందే గ్రహించిన మేల్కొన్న కోటంరెడ్డి...నిరసన గళం వినిపించారు. ఆయనకు మరో ఎమ్మెల్యే...మాజీమంత్రి ఆనంరాంనారాయణరెడ్డి(Aanam Ramnarayana Reddy జతకలిశారు. వీరితోపాటు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సైతం తోడవ్వడంతో...నెల్లూరు జిల్లాలో వైసీపీ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఈ అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడటంతో పార్టీ నుంచి వారి ముగ్గురిని జగన్ సస్పెండ్ చేశారు. దీంతో వారు తెలుగుదేశం(Telugudesam Party) పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్‌ టిక్కెట్ తెలుగుదేశం పార్టీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దక్కించుకోగా.... ఎట్లాగైనా ఆయన్ను ఒడించాలన్న లక్ష్యంగా  జగన్ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి(Adhala Prabhakar Reddy)ని బరిలో దించారు. అర్థబలంలో గట్టి నేతగా పేరున్న ఆదాలపై కోటంరెడ్డి ఏవిధంగా పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే.


ఆనం వర్సెస్‌ మేకపాటి


మంత్రి గౌతమ్‌రెడ్డి మృతితో ఆత్మకూరులో ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డిని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఇదేస్థానం నుంచి మరోసారి ఆయన పోటీపడుతుండగా.. వెంకటగిరి నుంచి గెలుపొందిన ఆనం రాంనారాయణరెడ్డి(Aanam Ramnarayan Reddy)కి టీడీపీ ఆత్మకూరు సీటు ఇచ్చింది. గతంలో ఆయన ఇక్కడ గెలిచిన అనుభవం ఉండటంతో చంద్రబాబు (Chandrababu)ఆనం రాంనారాయణరెడ్డికి నచ్చజెప్పి ఒప్పించారు. రాజకీయంగానూ, ఆర్థికంగానూ రెండు కుటుంబాలకు జిల్లాలో మంచి పేరు ఉండటంతో ఇక్కడ వీరిరువురి మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది.


ఖలీల్‌ అహ్మద్‌ వర్సెస్‌ నారాయణ


నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ ఫైర్‌బ్రాండ్ అనిల్‌కుమార్ యాదవ్‌ను నరసరావుపేట ఎంపీగా పంపించడంతో...సిటీ డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్‌ అహ్మద్‌కు వైసీపీ సీటు ఇచ్చింది. ఆయనపై నారాయణ(Narayana) విద్యాసంస్థల అధినేత నారాయణ పోటీ పడుతున్నారు. మరో కీలక నియోజకవర్గం సర్వేపల్లి నుంచి మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి (Kakani Gowardhan Reddy)మరోసారి బరిలో నిలిచారు. ఆయనపై పోటీకి మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తి చూపుతున్నా...ఇప్పటికే పలుమార్లు అక్కడ నుంచే ఆయన ఓటమిపాలవ్వడంతో టీడీపీ దీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది.


నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వర్సెస్‌ ప్రశాంతి రెడ్డి


వెంటగిరిలో ఈసారి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియను తెలుగుదేశం పార్టీ పోటీలో నిలపగా....వైసీపీ నుంచి మాజీముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌రెడ్డి పోటీలో ఉన్నారు. కోవూరులో ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వైసీపీ తరపున ఆయన మరోసారి టిక్కెట్ దక్కించుకోగా....వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భార్య ప్రశాంతిరెడ్డికి టీడీపీ టిక్కెట్ ఇవ్వడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న వేమిరెడ్డి ధాటికి ప్రసన్నకుమార్‌రెడ్డి ఏమాత్రం నెగ్గుకొస్తాడో చూడాలి.


ప్రకాశంలో ప్రకాశించేదెవరో..?
వైసీపీకి బలమైన జిల్లాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా కూడా ఒకటి. గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఈసారి  ఎన్నికలకు ముందు కొంత ఒడిదొడుకులకు లోనైనా....మళ్లీ కుదురుకుంది. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి పార్టీ మారతారని జోరుగా ప్రచారం సాగినా...ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు ఆయనతో చర్చించి బయటకు వెళ్లకుండా పార్టీలోనే కొనసాగేలా చేయడంలో సఫలమయ్యారు. మరోసారి ఆయన ఒంగోలు నుంచే బరిలో దిగుతుండగా..ఆయనపై పాత ప్రత్యర్థి దామచర్ల జనార్థన్‌ మరోసారి పోటీపడుతున్నారు.


గొట్టిపాటి రవి వర్సెస్‌ హనిమిరెడ్డి


మరో కీలక నియోజకవర్గం అద్దంకి నుంచి సిట్టింగ్ తెలుగుదేశం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పోటీపడుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న గొట్టిపాటిని వైసీపీలోకి లాగేందుకు జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. రవి మాత్రం మొండిగా ఆయనకు ఎదురునిలిచారు. రవిని ఎదుర్కొనే దీటైన అభ్యర్థి కోసం అన్వేషించిన జగన్... పలువురు అభ్యర్థులను మార్చిన జగన్ చివరకు చిన్న హనిమిరెడ్డికి టిక్కెట్ కేటాయించారు. సామాజికవర్గం పరంగా, ఆర్థికంగా బలమైన గొట్టిపాటి రవిని హనిమిరెడ్డి ఏమాత్రం పోటీ ఇస్తాడో చూడాలి.


ఎడంబాలాజీ వర్సెస్‌ సాంబశివరావు


పర్చూరులోనూ ఈసారి పాగా వేసేందుకు జగన్ ఎన్నో ఎత్తులు వేశారు. చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్‌ను ఇన్‌ఛార్జిగా నియమించగా...స్థానిక నేతలతో ఆయనకు పొసగలేదు. చివరకు ఎడం బాలాజీకి వైసీపీ టిక్కెట్ ఇచ్చింది. ఆయనపై సిట్టింగ్ తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పోటీ చేయనున్నారు. ఇక దర్శి వైసీపీ టిక్కెట్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి వైసీపీ కేటాయించగా...అదే పార్టీ నుంచి తెలుగుదేశంలోకి మారనున్న మాజీమంత్రి శిద్ధారాఘవరావుకు టిక్కెట్ కేటాయించే అవకాశం ఉంది. సంతనూతలపాడు నుంచి మంత్రి మేరుగ నాగార్జున, కొండిపి నుంచి మరో మంత్రి ఆదిమూలపు సురేశ్ బరిలో దిగుతున్నారు. వీరిపై విజయ్‌కుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి పోటీ పడుతున్నారు.