Revanth Reddy on Nagarjuna Sagar Issue: నాగార్జున సాగర్ ఘటనపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తతలు కేసీఆర్ కుట్ర అని రేవంత్ ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్న కేసీఆర్ పన్నాగాలు ఫలించబోవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సమర్థంగా నీటి పంపకాల విషయాన్ని పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.


‘‘పోలింగ్ రోజు ఇలాంటి ఘటనలకు తెరలేపారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తొమ్మిదిన్నర ఏళ్లుగా కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటికి శాశ్వత పరిష్కారం ప్రజామోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడటమే. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తాం. దేశాల మధ్య నీటి వాటాలు పంచుకుంటున్నాం.. అలాంటిది రాష్ట్రాల మధ్య వాటాలు పంచుకోలేమా..?


నీటి వాటాలు, ఆస్తుల పంపకాల విషయంలో కాంగ్రెస్ సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరిస్తుంది. అవసరమైనప్పుడు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్న కేసీఆర్ పన్నాగాలు ఫలించవు. కేసీఆర్ వి దింపుడు కల్లం ఆశలే.. ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ప్రభావం చూపాల్సిన అవసరం లేదు. వివాదాలను సామరస్యంగా సరైన పరిష్కారం చూపించే బాధ్యత మాది’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.