Nalgonda Khammam Warangala MLC Elections Results: తెలంగాణలో నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఉపఎన్నికల ఫలితంపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో నిలిచారు. అటు, స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 52 మంది పోటీలో ఉన్నారు. తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి టఫ్ ఫైట్ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ముగిసే సరికి తీన్మార్ మల్లన్న.. రాకేశ్ రెడ్డిపై 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్య ఓట్లు లెక్కించిన 4 రౌండ్లలో కలిపి తీన్మార్ మల్లన్నకు 1,23,368 ఓట్లు రాగా.. రాకేశ్ రెడ్డికి 1,04,630 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 43,541 ఓట్లు, మరో అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ 29,844 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. గురువారం రాత్రికి మొదటి ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. గెలుపు కోటా (చెల్లిన ఓట్లలో 50 శాతానికంటే ఒక ఓటు ఎక్కువ)గా పరిగణించే ఓట్లు 1,55,095 ఓట్లు ఎవరికీ రాకపోవడంతో విజేత ఎవరో నిర్ణయించేందుకు అధికారులు రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కింపు చేపట్టారు. కాగా, తీన్మార్ మల్లన్న గెలవాలంటే 31,727 ఓట్లు, రాకేశ్ రెడ్డికి 50,465 ఓట్లు కావాలి. అటు, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోకు కుమార్ ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభమైంది. అశోక్ కుమార్ నుంచి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు బదిలీ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి కౌంటింగ్ ముగిసే అవకాశం ఉంది.


తీవ్ర ఉత్కంఠ


ఈ క్రమంలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో భాగంగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. తాజా లెక్కల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండో ప్రయారిటీతో కలిసి 18,962 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు. ఆయన గెలిచేందుకు ఇంకా 31,885 ఓట్లు కావాలి. అటు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి గెలిచేందుకు 50,581 ఓట్లు కావాలి. రెండో ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్‌కు ఇప్పటివరకూ 397 ఓట్లు రాగా, బీఆర్ఎస్‌కు 266 వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో పాటు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.


అసలేంటీ ఎలిమినేషన్ ప్రక్రియ.?


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యతలో గెలుపు కోటాకు సరిపడా ఓట్లు ఏ అభర్థికీ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియలో రెండో ప్రాధాన్య ఓటును లెక్కించడం ద్వారా విజేతను నిర్ణయిస్తారు. పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో మొదటి ప్రాధాన్య ఓట్లు అతి తక్కువగా వచ్చిన వారిని తొలుత గుర్తిస్తారు. వారి బ్యాలెట్ పత్రాల్లో రెండో ప్రాధాన్య ఓటు ఎవరికి వచ్చిందో వాటిని ఆ అభ్యర్థికి జమ చేస్తారు. అనంతరం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని లెక్కింపు ప్రక్రియ నుంచి క్రమ పద్ధతిలో తప్పిస్తారు. దీన్ని ఎలిమినేషన్ ప్రక్రియ అంటారు. రిటర్నింగ్ అధికారి సూచన మేరకు అభ్యర్థులు సాధించిన ఓట్ల ఆధారంగా ఆరోహణ క్రమంలో జాబితాను తయారుచేశారు. వారందరికీ సమాచారం ఇచ్చి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు.


భారీగా చెల్లని ఓట్లు


ఈ ఎన్నికల్లో 3,36,013 ఓట్లు పోల్ కాగా.. 25,824 ఓట్లను చెల్లనవిగా  అధికారులు నిర్ధారించారు. వీటిలో తొలి 3 స్థానాల్లో ఉన్న వారివే ఎక్కువగా ఉన్నాయి. తొలి రెండు రౌండ్లలోనేే 15,126 ఓట్లు చెల్లకుండా పోయాయి. చాలామంది ఓటర్లు నచ్చిన అభ్యర్థి పక్కన గడిలో నెంబర్లు వేయాల్సి ఉండగా.. రైట్ మార్క్ చేయడం, అభ్యర్థి ఫోటోపై సంతకం, ప్రాధాన్యతను తెలిపే సంకేతాన్ని తెలుగు, ఆంగ్లంలో రాయడం, కొన్నిచోట్ల 'జై తెలంగాణ', 'జై కాంగ్రెస్' వంటి నినాదాలు రాయడంతో ఎక్కువ ఓట్లు చెల్లకుండా పోయాయి. 


Also Read: Wishesh to Pawan kalyan: పవన్‌ కళ్యాణ్‌కు శుభాకాంక్షల వెల్లువ-జనసేనాని రియాక్షన్‌ ఇదే..