Jubilee Hills by-election : తెలంగాణ జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భావోద్వేగానికి గురయ్యారు. రహమత్నగర్లో ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావవేశంలో ఎమోషన్ అయ్యారు. తన భర్త చేసిన గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించే వాళ్లను గుర్తు చేసుకున్నారు. ప్రజల తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రాత్రిపగలు శ్రమించారని వివరించారు. కష్టకాలంలో తనకు తన కుటుంబానికి అండగా ఉన్న వాళ్లకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. ఎప్పుడూ తమకు తోడుగా ఉంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు హరీష్రావు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చారని ఆరోపించారు. పెద్దలను పట్టించుకోకుండా కేవలం పేదల ఇళ్లు మాత్రే కూలుస్తున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ను ఒడించి బీఆర్ఎస్ను గెలిపించుకుంటే హైడ్రాకు అడ్డుకట్ట పడుతుందని చెప్పుకొచ్చారు.
గత ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు బీఆర్ఎస్కు అండగా నిలబడ్డాయని కేటీఆర్ గుర్తు చేశారు. మిగతాప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ మాయమాటలను నమ్మడంతోనే ఇక్కడి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని రాత్రికి రాత్రే ప్రజలను నడిరోడ్డుపై ఈ ప్రభుత్వం నిలబెడుతోందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కొట్టి దెబ్బకు ఆరు గ్యారంటీలతో ప్రజల ముందుకు ప్రభుత్వం వచ్చి నిలబడుతుందని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఇన్నేళ్లుగా నియోకవర్గ ప్రజలకు సేవ చేసిన మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు మంచి చేయాలని బీఆర్ఎస్ సూచిస్తే ముఖ్యమంత్రి మాత్రం బూతులు తిడుతున్నరని గలీజు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు కేటీఆర్. ఎన్నికల్లో భారీ హామీలు ఇచ్చి ఇప్పుడు వాటి గురించి ప్రశ్నిస్తే తనవద్ద లంకెబిందెలు లేవని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎవరు చూసి ఉండరని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకావడం లేదని ఇప్పుడు ప్రజలు తిరస్కరిస్తారని దొంగచాటున గెలిచే పన చేస్తున్నారని అన్నారు. అందుకే భారీగా దొంగ ఓట్లను చేర్చి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఎగ్గొట్టిన హామీలను ప్రజలకు వివరించి నెల రోజుల పాటు వారిని చైతన్యం చేయాలని చెప్పారు. వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల హామీలను అమలు చేయని ప్రభుత్వానికి కచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా చురకలు తగిలించాలని మరో మాజీ మంత్రి హరీష్రావు పిలుపునిచ్చారు. అందుకే ఈ ఉపఎన్నిక చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. యావత్ తెలంగాణ జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారని ఇక్కడ ప్రభుత్వానికి బుద్ది చెప్పేలా తీర్పు ఉంటే ప్రజలంతా హర్షిస్తారని అభిప్రాయపడ్డారు. అప్పుడే కనువిప్పు కలిగి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి ముందుకొస్తారని చెప్పారు.