Gujarat Assembly Elections 2022: గుజరాత్‌లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు (డిసెంబర్ 1) మొదటి దశలో పోలింగ్ జరగనుంది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా 181 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా పోటీని ఆసక్తికరంగా మార్చింది. గుజరాత్‌లో గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.


మొదటి దశలో 89 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 2 కోట్ల 39 లక్షల 76 వేల 670 మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు. ఈ 89 అసెంబ్లీ స్థానాలకు 39 రాజకీయ పార్టీల నుంచి మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొదటి దశలో కొన్ని ముఖ్యమైన సీట్లలో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 


1. ఖంభలియా అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గద్వీ బరిలో ఉన్నారు. ఈ సీటు ద్వారకా జిల్లా పరిధిలోకి వస్తుంది. 2017 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. ఈసారి ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గాధ్వీ ఇక్కడ పోటీ చేసస్తున్నారు. దీంతో పోటీ మంచి ఆసక్తిని పెంచింది.


2. భావ్ నగర్ రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పురుషోత్తం సోలంకిపై బీజేపీ మరోసారి నమ్మకం పెట్టుకుంది. ఆయన కోలి సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు.


౩. రాజ్కోట్ జిల్లాలోని జస్దాన్ స్థానం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ సీనియర్ లీడర్‌ కున్వర్జీ బవాలియా పార్టీ మారి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం నుంచి బవాలియాకు వ్యతిరేకంగా భోలాభాయ్ గోయల్‌ను బరిలోకి దింపింది. 


4. మోర్బీ అసెంబ్లీ స్థానంలో మోర్బీ బ్రిడ్జి ప్రమాద హీరో కాంతిలాల్ అమృతియాను బీజేపీ తన అభ్యర్థిగా నిలబెట్టింది. అమృతియా ఈ స్థానం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ జయంతి జెరాజ్ భాయ్ ను బరిలోకి దింపింది.


5. పోర్బందర్ అసెంబ్లీ స్థానం నుంచి బిజెపి తన అభ్యర్థిగా బాబు బొఖిరియాను నిలబెట్టింది. అతను మెర్ కమ్యూనిటీకి చెందినవాడు. 1995, 1998, 2012, 2017 సంవత్సరాల్లో ఈ స్థానం నుంచి గెలుపొందారు. 2002, 2007లో బొఖిరియా తన ప్రత్యర్థి, గుజరాత్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్జున్ మోధ్వాడియా చేతిలో ఓడిపోయాడు. ఈ సారి కూడా ఇద్దరూ ముఖాముఖి తలపడుతున్నారు. 


6. జామ్నగర్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాను బీజేపీ బరిలోకి దింపింది. ఈ స్థానం నుంచి మనోజ్ కైతిరియాను కాంగ్రెస్ నిలబెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ విశాల్ త్యాగిని బరిలోకి దింపింది.


7. అమ్రేలీ అసెంబ్లీ స్థానం నుంచి పరేష్ ధనానీని కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఈయన 2002లో బీజేపీ అభ్యర్థి పురుషోత్తం రూపాలాను ఓడించారు. దీని తరువాత ఆయనను 'జెయింట్ కిల్లర్'గా పిలిచేవారు. ఈ స్థానం నుంచి కౌశిక్ భాయ్ వెకారియాను బిజెపి నిలబెట్టింది. ఆప్ తన అభ్యర్థిగా రవి ధనానీ పోటీ చేస్తున్నారు. 


8. లాతీ అసెంబ్లీ స్థానం కూడా అమ్రేలి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా వీర్జీ తుమ్మర్ ను నిలబెట్టింది. ఈ స్థానానికి బిజెపి తన అభ్యర్థిగా జనక్ భాయ్ తలావియాను బరిలో నిలిపింది. ఈ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ జయసుఖ్ డెట్రోజాను బరిలోకి దింపింది. 2017లో కాంగ్రెస్ అభ్యర్థి విర్జీభాయ్ తుమ్మర్ విజయం సాధించారు.


9. కతర్గాం అసెంబ్లీ స్థానం కూడా మొదటి దశ ఓటింగ్ లో ఉంది. ఈ స్థానం నుంచి పాటిదార్ నాయకుడు గోపాల్ ఇటాలియాను ఆమ్ ఆద్మీ నిలబెట్టింది. గోపాల్ ఇటాలియా ఇటీవల ప్రధానినరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది.


10. వరాచా అసెంబ్లీ స్థానం సూరత్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ స్థానం నుంచి అల్పేష్ కతిరియాను బరిలోకి దింపింది. ఆయన బిజెపి నేత హార్దిక్ పటేల్ కు అత్యంత సన్నిహితుడు. అదే సమయంలో ఈ స్థానం నుంచి కిశోర్ భాయ్ కనానీకి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రఫుల్ భాయ్ చగన్ భాయ్ తొగాడియాను నిలబెట్టింది. 


11. తలాలా అసెంబ్లీ నియోజకవర్గం సోమనాథ్ జిల్లా పరిధిలోకి వస్తుంది. బీజేపీలో చేరిన మరుసటి రోజే భగవాన్ బరాద్ ను అసెంబ్లీ స్థానం నుంచి పార్టీ బరిలోకి దింపింది. భగవాన్ బరాద్ అహిర్ కమ్యూనిటీకి చెందిన ప్రభావవంతమైన నాయకుడు. ఆయన 2007 మరియు 2017లో తలాలా నియోజకవర్గం నుంచి గెలిచారు. 2017 అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ మొత్తం నాలుగు స్థానాలను గెలుచుకోవడంతో జిల్లాలో బిజెపి తన ఖాతాను తెరవలేకపోయింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ మాన్సింగ్ దోడియాను బరిలోకి దింపింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ స్థానం నుంచి దేవేంద్ర సోలంకిని బరిలోకి దింపింది.