CM Jagan :   చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని ప్రజలను హెచ్చరించారు సీఎం జగన్. కాకినాడ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయని..  ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్‌ నగరా మోగిందని గుర్తు చేశారు.  మరోవంక ప్రజలంతా కూడా, పేదలంతా మరోసారి జైత్రయాత్రకు సిద్ధం సిద్ధం అంటూ గర్జిస్తూ సింహ గర్జన చేస్తున్నారన్నారు.  ఇంటింట ఆత్మగౌరవాన్ని,  పేద వర్గాల ఆత్మగౌరవాన్ని, అక్క చెల్లెమ్మల గౌరవాన్ని  కాపాడుతున్న మన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. 


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒకటి లేదన్నారు. 2014లో ఇదే ముగ్గురు కలిసి కొన్ని ముఖ్యమైన హామీలు ఇచ్చారు..అవి చేశారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఆడబిడ్డ పుడితే 25 వేలు అకౌంట్‌లో వేస్తామన్నారు వేశారా? రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా? అని ధ్వజమెత్తారు. కొత్తగా సూపర్ సిక్స్ అంటున్నారు. నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నే తాము గెలిస్తే పథకాలు కొనసాగుతాయని చెప్పారు. టీడీపీకి ఓటు వేస్తే పథకలు రద్దు చేస్తారని చెప్పారు. మళ్లీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు. మీరు వేసె ఓటే ఐదేళ్ల భవిష్యత్తు అని సీఎం జగన్ తెలిపారు.
 
జన్మభూమి ‍కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా, పెత్తందార్ల దోపిడీ వర్గానికి మన పేదల అనుకూల వర్గానికి ఒక క్లాస్‌వార్‌ జరుగుతోందన్నారు. ఈ జరుగుతున్న యుద్ధంలో పేదల భవిష్యత్‌ కొరకు.. వ్యతిరేక కూటమితో యుద్ధం జరుగుతుందని.. ఈ పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు.. రాబోయే 60 నెలల పాటు ఎలాంటి పరిపాలన ఉండాలని నిర్ణయించే ఎన్నికలన్నారు. వచ్చే ఐదేళ్ల కాలంలో మీకు ఈరోజు జగన్‌ ద్వారా అందుతున్న పథకాలు కొనసాగలా.. వద్దా అన్నది మీ ఓటు ద్వారా నిర్ణయం అవుతుందన్నారు. జగన్‌కు ఓటేస్తే.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తే.. పథకాలన్నీ కొనసాగతాయి లేదంటే బాబు మార్క్‌తో. మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయన్నారు. ఇది బాబు చెబుతున్న చరిత్ర.. బాబు చూసిన ఏ ఒక్కరికైనా అర్థమయ్యే చరిత్ర అన్నారు. 


మ్యానిఫెస్టోతో మోసం చేయడానికి బాబు మళ్లీ సిద్ధం అయ్యాడని.. జగన్‌కు ఓటేస్తే.. పట్టణాల్లోనూ, వార్డుల్లోనూ జగన్‌ మార్క్‌ సచివాలయ సేవలన్నీ కొనసాగుతాయన్నారు. ఫ్యాన్‌కు ఓటేస్తే.. ఇంటి వద్దే మూడు వేల రూపాయల పెన్షన్‌ అందుతుంది. అదే సమయంలో పెన్షన్‌ అందిస్తున్న జగన్‌ మార్క్‌ పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుందన్నారు.  ఏకంగా రెండు లక్షల డబ్బై కోట్ల రూపాయలను నేరుగా నా అక్క చెల్లెమ్మ ఖాతాల్లోకి జమ చేశామని.. ఎక్కడ వివక్ష లేకుండా, లంచాలు లేకుండా పాలన కొనసాగిందన్నారు. లేదంటే ఇప్పుడు జరుగుతున్న దానికి బాబు మార్క్‌ ముగింపు ఉంటుందని స్పష్టం చేశారు. మళ్లీ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరుగుతుందని పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఒక చంద్రముఖి నిద్ర లేస్తుంది.. మళ్లీ ఒక పసుపుపతి నిద్ర లేస్తాడు.. వదల బొమ్మాలి.. వదల బొమ్మాలి అంటూ మీ రక్తం తాగేందుకు మీ ఇంటికే వస్తాడని హెచ్చరించారు.  


సభలో పవన్ పైనా జగన్ విమర్శలు గుప్పించారు.  బాబు సిట్‌ అంటే పవన్‌ సిట్‌.. స్టాండ్‌ అంటే పవన్‌ స్టాండ్‌ ..ప్యాకేజీ స్టార్‌కు పెళ్లిళ్లే కాదు.. నియయోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయన్నారు. చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడని.. జ్వరం వస్తే ప్యాకేజీ స్టార్‌ పిఠాపురం వదిలేసి హైదరాబాద్‌ పారిపోయే రకమన్నారు. బీఫామ్‌ బీజేపీ, కాంగ్రెస్‌, గాజుగ్లాస్‌దే అయినా..యూనిఫామ్‌ మాత్రం చంద్రబాబుదేనన్నారు. రాష్ట్రాన్ని హోల్‌సేల్‌గా దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని  ఆరోపించారు.