BJP manifesto will be released on Sunday :  సంకల్ప పత్ర్ పేరుతో భారతీయ జనతా పార్టీ  లోక్ సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేయనుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.  రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో మేనిఫెస్టోను రెడీ చేశారు.  ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాత మేనిఫెస్టో తయారు చేసింది ఆ కమిటీ.  ప్రధానమంత్రి నరేంద్రమోడీ, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నారు. 


15 లక్షల మంది అభిప్రాయాలు తీసుకుని మేనిఫెస్టో 


మోడీ గ్యారెంటీ, వికసిత భారత్‌ థీమ్‌తో మేనిఫెస్టోను రూపొందించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా దీన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.   సంకల్ప పత్రం కోసం దాదాపు 15 లక్షల సూచనలు రాగా.. ఇందులో 4 లక్షలకు పైగా అభిప్రాయాలను ప్రజలు నమో యాప్‌ ద్వారా తెలియజేశారు. మేనిఫెస్టో కోసం 15 లక్షల సూచనలు బీజేపీకి వచ్చాయి. వాటిలో 4 లక్షల సూచనలు నమో యాప్ ద్వారా, 11 లక్షల సలహాలు వీడియోల రూపంలో వచ్చాయి. 27 మందితో కూడిన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కో-ఆర్డినేటర్‌గా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కో-కోఆర్డినేటర్‌గా ఉన్నారు.వాటన్నంటిని పరిశీలించిన కమిటీ మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అన్ని రాష్ట్రాలకు చెందిన  కీలక హామీలు మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది.   


వికసిత భారత్ - మోదీ గ్యారంటీ                 


 అభివృద్ధి భారతం లక్ష్యంగా మహిళలు, యువత, పేదలు, రైతుల అభ్యున్నతికి మేనిఫెస్టో భరోసా ఇవ్వనుంది. సాధించగలిగిన హామీలను మాత్రమే ఇవ్వడం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం మేనిఫెస్టో ప్రధాన ఉద్దేశంగా చెప్పనుంది. కల్చరల్ నేషనలిజంపై దృష్టిసారిస్తూ 2047 నాటికి అభివృద్ధి భారతం సాధిస్తామనేది మోదీ ప్రధాన గ్యారెంటీగా ఉండనుంది. ''సబ్ కా సాథ్ సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ సబ్‌కా ప్రయాస్'' అనే మంత్రంతో సంకల్ప్ పత్ర ఉటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 


పాంచ్ న్యాయ్ పేరుతో ఇప్పటికే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల                 


కాంగ్రెస్‌ పార్టీ న్యాయ పత్రం పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. పంచ న్యాయాలు, 25 గ్యారంటీలను అందులో ప్రకటించింది. ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 26న రెండో విడత, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఈసారి 400కు పైగా సీట్లు సాధిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాల ఇండియా కూటమి కూడా విజయకేతన ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.