BJP Yathra: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో  తెలంగాణలో బీజేపీ(BJP) సైతం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటి నుంచి జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తమకు తొలి నుంచీ కలిసొచ్చే హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేసేందుకు బీజేపీ రథయాత్రలకు శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో... ఈసారి లోక్ సభ ఎన్నికలపై ప్రత్యేకంగా కమలం పార్టీ దృష్టి సారించింది. కొత్త సీట్ల సంగతి ఎలా ఉన్నా...గతంలో గెలిచిన చోట్ల సీట్లు చేజారిపోకుండా హిందూకార్డును ప్రయోగిస్తోంది..


రేపటి నుంచి రథయాత్రలు   
ఎన్నికలు వచ్చాయంటే హిందూఓట్లకు ఎరవేయడంలో బీజేపీ(BJP) ఎప్పుడూ ముందుంటుంది. గతంలో ఆపార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అద్వానీ(Advani) దేశవ్యాప్తంగా రథయాత్ర చేపట్టి..తొలిసారి ఆ పార్టీని దిల్లీ గద్దెనెక్కించారు. ఇప్పుడు తెలంగాణ(Telangana)లోనూ కమలం పార్టీ అదే ఫార్ములా ప్రయోగిస్తోంది. ఈనెల 20 నుంచి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ రథయాత్రలకు శ్రీకారం చుట్టింది. నేడు చార్మినార్(Charminar) భాగ్యలక్ష్మీ ఆలయం(Bhagya Lakshimi Temple)లో ప్రచార వాహనాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పూజలు చేసి ప్రారంభించనున్నారు. 5 క్లస్టర్లుగా 16 ఎంపీ సెగ్మెంట్‌లలో జరిగే ఈ రథయాత్రలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు పాల్గొననున్నారు.


ఎంపీ సీట్లపై కన్ను
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంపై కన్నేసిన బీజేపీ...దేశవ్యాప్తంగా ఎంపీసీట్లు గెలవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పైగా ఎన్డీఏ 400 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈక్రమంలో ఎట్టిపరిస్థితుల్లోనూ  తెలంగాణలో పది ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ కేంద్ర అధినాయకత్వం రాష్ట్ర నేతలను ఆదేశించింది.  అందులో భాగంగానే  విజయ సంకల్ప రథయాత్రలకు ఆ పార్టీ శ్రీకారం చుడుతోంది. ఈ నెల 20 నుంచి నాలుగు చోట్ల నుంచి ఈ రథయాత్రల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ యాత్రలు మార్చి 1న ముగించేలా ఏర్పాట్లు చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద జరిగి ప్రచార రథాల పూజా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు ఎంపీలు బండి సంజయ్(Bandi Sanjay), లక్ష్మణ్(Laxman), ఈటెల రాజేందర్(Etela Rajendra) సహా పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. 


క్లస్టర్ల విభజన
హైదరాబాద్ మినహాయించి 16 ఎంపీ స్థానాలను ఐదు క్లష్టర్లుగా రాష్ట్రాన్ని విభజించారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలు ఉండనున్నాయి. ఈ ఐదు క్లష్టర్లకు తెలంగాణలోని చారిత్రక ప్రదేశాల పేర్లు పెట్టారు. 
భాగ్యలక్ష్మీ క్లస్టర్: ఈ కస్టర్ పరిధిలో మూడు ఎంపీ సెగ్మెంట్లు రానున్నారు. రేపు భువనగిరిలో ప్రారంభం కానున్న రథయాత్ర 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ  హైదరాబాద్ లోయాత్ర ముగియనుంది. 
కొమురం భీం క్లస్టర్‌:  ఈక్లస్టర్ పరిధిలోనూ రేపే యాత్ర ప్రారంభంకానుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ముథోల్‌లోమొదలుకానుంది. ఈ కార్యక్రమానికి  అస్సోం సీఎం హిమంతబిశ్వ శర్మ హాజరుకానున్నారు. ఈ యాత్ర సైతం 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగి నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ముగుస్తుంది 
రాజరాజేశ్వరి క్లస్టర్‌: వికారాబాద్‌ జిల్లా తాండూరులో రేపు ఈ రథయాత్రను  గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ ప్రారంభించనున్నారు. 4 ఎంపీ సెగ్మెంట్‌ల పరిధిలో ని 28 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ కరీంనగర్‌లో యాత్ర ముగియనుంది.
కృష్ణమ్మ క్లస్టర్‌ : నారాయణపేట జిల్లా మక్తల్‌లో రేపు ప్రారంభం కానున్న రథయాత్ర 3 ఎంపీ సెగ్మెంట్‌ల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగి నల్లగొండలో ముగుస్తుంది
కాకతీయ–భద్రకాళి యాత్ర : ఇది ఈ నెల 25వ తేదీన భద్రాచలంలో ప్రారంభమై 3 ఎంపీ సెగ్మెంట్‌ల పరిధిలోని  21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ ములుగులో ముగుస్తుంది.