Exit Poll Results: పశ్చిమ బెంగాల్,తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. నాల్గో తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఈ లోపు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఆసక్తిని పెంచేస్తున్నాయి. దాదాపు నెల రోజులపాటు సాగిన ఈ ప్రక్రియలో ఓటర్ తీర్పు ఏంటనే అంశంపై వివిధ సంస్థలు సర్వేలు నిర్వహించాయి. వాటిని బుధవారం సాయంత్ర వెల్లడించాయి. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం ఆరున్నర గంటలకు అంచనాలు ప్రకటించాయి. ఇందులో చాలా ఆసక్తికరమైన లెక్కలు చూసిన విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. 

Continues below advertisement

పశ్చిమ బెంగాల్‌ పీఠంపై ఉత్కంఠ

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలకు జరిగి ఎన్నికల్లో ఈసారి భిన్నమైన అంచనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. 

పోల్ డైరీ, మ్యాట్రిజ్, పి-మార్క్ వంటి సంస్థలు బెంగాల్‌లో ఈసారి బీజేపపీకి ఛాన్స్ ఉంటుందని అంచనాలు వేశాయి. పీ-మార్క్ సర్వే ప్రకారం బీజేపీ 150-175 సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది. ఆ పార్టీ మొదటిసారి బెంగాల్‌లో అధికారాన్ని చేపట్టవచ్చు. 

Continues below advertisement

మరోవైపు పీపుల్స్ పల్స్, జన్మత్ పోల్స్ మాత్రం మమత బెనర్జీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటారని చెబుతున్నారు. పీపుల్స్ పల్స్ ప్రకారం టీఎంసీ 177-187 స్థానాలు కైవశం చేసుకుంటుందని అంటున్నారు. 

బెంగాల్‌లో అధిక ఓటింగ్ శాతం ఎవరి నెత్తిన  పాలు పోస్తుంది. ఎవరి కొంప ముంచుతుందో అన్న టెన్షన్ అటు పార్టీల్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

తమిళనాడులో విజయ్ సత్తా చాటుతారా?

తమిళనాడులో రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఒక మూడో శక్తి బలంగా వినిపిస్తోంది. అదే విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం. ఇక్కడ కూడా చాలా వరకు డీఎంకే గెలుస్తుందని చెబితే, ఒక్క సర్వే మాత్రం విజయ్ వైపు మొగ్గింది. 

మెజారిటీ సర్వేలు పీపుల్స్ పల్స్, మ్యాట్రిజ్ సహా ఇతర సంస్థలు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతత్వంలోని డీఎంకే కూటమికి అధికారాన్ని కట్టబెట్టాయి. వీరికి 122- 146 సీట్లు రావచ్చని అంచనా. 

అయితే ప్రముఖ సర్వే సంస్థ యాక్సిస్‌ మై ఇండియా మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచే ఫలితాలు వెల్లడించింది. మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేసింది. ఒక వేళ ఇది నిజమైతే తమిళ రాజకీయాల్లో ఇది చారిత్రక మలుపు కానుంది. 

కేరళంలో మార్పునకు ఛాన్స్ 

కేరళం సంప్రదాయం ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే కేరళ ఓటర్లు, ఈసారి ఎల్‌డీఎఫ్‌ను సాగనంపి యూడీఎఫ్‌కు పట్టం కట్టబోతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. దాదాపు అన్ని సంస్థలు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఫ్ 70 నుంచి 90 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. 

అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్‌

ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో మాత్రం బీజేపీ తన సత్తా చాటుకోనుంది. 126 స్థానాలకు బీజేపీ 85 నుంచి 100కుపైగా సీట్లు గెలుచుకోవచ్చని అన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి. అక్కడ బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని అంటున్నారు. 

పుదుచ్చేరిలో ఏఐఎన్‌ఆర్‌సీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అధికారం తగ్గే ఛాన్స్ ఉందని సర్వేల అంచనా.