Telangana Elections 2023 AP government employees  : తెలంగాణలో గురువారం జరగనున్న ఎన్నికల్లో   ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించే ఏపీకి చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఉన్న ఏపీ ఉద్యోగులకు రేపు ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉద్యోగుల సంఘం నేతలు చేసిన విజ్ఞప్తికి ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఉద్యోగులు హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్నారు. వారు తెలంగాణలో రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకుంటే.. వారికి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తున్నట్లు ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 


రాష్ట్ర సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు ఈ సెలవు మంజూరు చేస్తున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.  తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వేతనంతో కూడిన సెలవు కావాలని కోరుకుంటున్న ఏపీ ఉద్యోగులు సరైన ఆధారాలు చూపించి సెలవు పొందేలా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ ఓటు హక్కు కలిగిన ఉద్యోగులకు ఇది మేలు చేయనుంది. అసలే హైదరాబాద్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఇందు కోసం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు రేపు సెలవు ప్రకటించడంతో పాటు ఓటింగ్ లో పాల్గొనేలా తగిన చర్యలు తీసుకుంటుంది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వినతిని కూడా ఏపీ సీఈఓ ముఖ్య ఎన్నికల అధికారి అంగీకరించారు.


నవంబర్ 30వ తేదీన ఎన్నికల సంధర్భంగా సెలవు ప్రకటించాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా, వ్యాపార సంస్థలను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక రేపు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. ఎన్నికలు జరిగే రోజున తెలంగాణలోని అన్ని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని సీఈవోగా తాను ఆదేశాలు జారీ చేశానని ఆయన వెల్లడించారు. ఉద్యోగులు అందరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ కంపెనీలు హాలిడే ప్రకటించాలని ఆదేశాల్లో పేర్కొన్న ఎన్నికల సంఘం ఆరోజున సెలవు ఇవ్వని సంస్థలు, కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.


నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 35, 655 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాటు కొనసాగుతున్నాయి. ఎన్నికల పరిశీలన కోసం 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లు, స్వాడ్లను ఎన్నికల కమిషన్ నియమించుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో దాదాపు 1.85 లక్షల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.