Andhra Pradesh News | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Ys Jagan) విమర్శించారు. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా  ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాకపోవడం  పెద్ద ఉదాహరణ అన్నారు. ఇంజినీరింగ్ క్లాసులు ప్రారంభం అవుతున్నా ఈసెట్ వారికి కౌన్సెలింగ్ ప్రారంభం కాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు జగన్.

రేపటి నుంచి ఏపీలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు  క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. కానీ ఈసెట్ రిజల్ట్స్ వచ్చి 45 రోజులు గడుస్తున్నా కౌన్సెలింగ్ లో అడుగు కూడా ముందుకు పడలేదని జగన్ విమర్శించారు. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ లో 34వేల మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే.. అందులో 31,922 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 

మే 15వ తేదీన ఏపీ ఈసెట్ ఫలితాలు వెలువడినా నేటికి లేటరల్ ఎంట్రీ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ప్రక్రియపై షెడ్యూల్‌ విడుదల చేయలేదు. ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో ఇంజనీరింగ్ లో చేరాలనుకునే పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏపీలో విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు ఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కాకపోవడమే  నిదర్శనం అన్నారు. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు అంటూ జగన్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.