Holidays for Educational Institutions: తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నవంబరు 29, 30 తేదీల్లో పాఠశాలలకు (school holidays) ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబరు 30న రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరగనుంది. నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నవంబరు 29న ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించన్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. డిసెంబర్ 1న మళ్లీ స్కూళ్లు, కాలేజీలూ తెరచుకోనున్నాయి. 


ఎన్నికలు జరిగే రోజున తెలంగాణలోని అన్ని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని సీఈవో వికాస్‌ రాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ కంపెనీలు హాలిడే ప్రకటించాలన్నారు. సెలవు ఇవ్వని సంస్థలు, కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కొన్ని ఐటీ, ప్రైవేట్ కంపెనీలు సెలవు ఇవ్వలేదని తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల రోజున సంస్థలు సెలవులు ఇవ్వకపోవడంతో ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నవంబర్ 30న ఎన్నికల రోజు అన్ని సంస్థలు హాలిడే ఇస్తున్నాయో లేదో పరిశీలించి, సెలవు ఇవ్వని కంపెనీ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు తెలంగాణ సీఈవో వికాస్‌ రాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. 


రాష్ట్ర వ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటర్లు..
ఈసారి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటర్లు.. ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,750 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2,676 మంది, సర్వీస్ ఓటర్లు 15,406, ఓవర్సీస్ ఓటర్లు 2,944 మంది ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. 119 నియోజకవర్గాల్లో 2290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నాయని అన్నారు. 


నవంబరు 30న పోలింగ్.. డిసెంబరు 3న కౌంటింగ్
రాష్ట్రవ్యాప్తంగా నవంబరు  30న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 3న కౌంటింగ్ జరుగనుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఉంటుందని వికాస్ రాజ్ చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత అర్థ గంట వరకూ ఎగ్జిట్ పోల్స్ ప్రచురణపైనా నిషేధం విధించారు. ఈ నెల 30న పోలింగ్, వచ్చే నెల మూడో తేదీన కౌంటింగ్ జరుగనున్నది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఉంటుందని వికాస్ రాజ్ చెప్పారు. 4000 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పరిధిలో అదనపు సిబ్బందిని నియమిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ లను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకుంటారని వెల్లడించారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply