TS Inter Syllabus : తెలంగాణలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ సిలబస్ మార్పుచేశారు. ఈ ఏడాది నుంచి కొత్త సిలబస్ తో ఇంగ్లీషు పుస్తకాలు త్వరలో విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఇంగ్లీష్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మారిన సిలబస్ ను ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపారు. మారిన సిలబస్ తో పుస్తకాలు త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు మారిన సిలబస్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు పేర్కొంది.  


సప్లిమెంటరీ గడుపు పెంపు


విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు సప్లిమెంటరీ ఫీజు గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల ఎనిమిదో తేదీలోపు సప్లిమెంటరీ ఫీజులు చెల్లించాలని అందులో పేర్కొంది. ఫీజులను నేరుగా గానీ లేదా వేరే ఇతర గేట్‌వేల ద్వారా కూడా ఫీజులు చెల్లించ వచ్చని తెలిపింది.  ఫలితాలు విడుదల చేసిన రోజున మంత్రి మాట్లాడుతూ... ఇంటర్‌మీడియెట్ తప్పిన వాళ్లు కానీ, అదనపు మార్కుల కోసం ప్రయత్నించే వాళ్లైనా సరే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రాసుకోవచ్చని చెప్పారు. దీనికి సంబంధించిన ఫీజులను జూన్ 30 లోపు చెల్లించాలని సూచించారు. అయిచే ఫలితాలు రిలీజైన తేదీకి అడ్వాన్స్‌డ్‌ ఫీజు చెల్లింపు ఆఖరి గడువుకు చాలా తక్కువ గ్యాప్ ఉందని అంతా భావించారు. ఈ గడువు పెంచాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మెయిల్స్ ద్వారా, ఫోన్‌ల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. 


అందరి అభిప్రాయాలు తీసుకున్న ప్రభుత్వం విద్యార్థులకు మరో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డుకు ఆదేశాలు పంపించింది. దీంతో ఇంటర్ బోర్డు ఎనిమిదో తేదీ వరకు ఫీజులు చెల్లించుకునేందుకు అవకాశం కల్పించారు. ఇది ఆఖరి గడువని తేల్చి చెబుతున్నారు అధికారులు. ఇకపై మరోసారి పెంపు ఉండదని... ఈ లోపు ఫీజులు చెల్లించుకోవాలని తెలిపారు. జులై 8లోపు ఫీజులు చెల్లించిన వారికి ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించిన టైం టేబుల్ ఇంకా విడుదల కాలేదు. ఆ పరీక్షలను ఉదయం సాయంత్ర కూడా నిర్వహిస్తారు. వాటిని వీలైన త్వరగా పూర్తి చేసి వ్యాల్యూయేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రక్రియ మొత్తం ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేసి ఫలితాలు విడుదల చేయాలని భావించింది. 


ఇంటర్ ఫలితాల్లో 


తెలంగాణలో ఇంటర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  జూన్‌ 28న విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఫస్టియర్‌లో అమ్మాయిలు 1,68,692 మంది పాస్  72.30 శాతం, అబ్బాయిలు 1,25,686 మంది 54.20 శాతం పాస్ అయ్యారు. ఇంటర్ సెకండియర్‌లో  67.16 శాతం మంది విద్యార్థులు పాసైనట్లు మంత్రి సబిత వెల్లడించారు. ఉత్తీర్ణత కాని ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల కోసం ప్రత్యేక క్లాస్‌లు పెట్టాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.