తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ జులై 24 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే మొదటి దశ కౌన్సెలింగ్‌ పూర్తికాగా, జులై 16న సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. మొద‌టి విడత కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థుల‌ు జులై 23లోగా సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం జులై 24 నుంచి రెండో విడత  కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది.


విద్యార్థులు జులై 24, 25 తేదీల్లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్‌ ఫీజును చెల్లించి, స్లాట్ బుకింగ్‌ చేసుకోవాలి. వీరికి జులై 26న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. జులై 24 నుంచి 27 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. జులై 27న సీట్లను ఫ్రీజ్‌ చేయనున్నారు. ఇక జులై 31న అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌రిపోర్ట్‌ చేయడంతో పాటు, ట్యూషన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


మొదటి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 173 కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో 82,666 సీట్లుండగా.. 70,665 సీట్లను కేటాయించారు. మిగిలిన 12,001 సీట్లను, రెండో విడత కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీచేయనున్నారు. అంతేకాకుండా మొదటి విడుతలో సీట్లు పొందిన వారు ట్యూషన్‌ ఫీజు చెల్లించని పక్షంలో ఆయా సీట్లు రద్దయినట్లుగా భావించి, వాటిని రెండో విడత కౌన్సెలింగ్‌కు బదిలీ చేస్తారు. దీంతో రెండో విడతలో కేటాయించే సీట్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.


తొలి దశ కౌన్సెలింగ్ ద్వారా మొత్తం 85.48 శాతం మంది విద్యార్థులు సీట్లు పొందారు. వీటిలో మూడు యూనివ‌ర్సిటీలు, 28 ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండాయి. యూనివ‌ర్సిటీల్లో 85.12 శాతం, ప్రైవేటు యూనివ‌ర్సిటీల్లో 75.08 శాతం, ప్రైవేటు కాలేజీల్లో 85.71 శాతం సీట్లు నిండాయి. మొత్తం 82,666 ఇంజినీరింగ్ సీట్లు ఉండ‌గా, ఫ‌స్ట్ ఫేజ్‌లో 70,665 సీట్లు భ‌ర్తీ కాగా.. 12,001 సీట్లు మిగిలిపోయాయి. మిగిలిపోయిన సీట్ల భర్తీకి జులై 24 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇక ఆగస్టు 4 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభిస్తారు. ఈ ఏడాది తెలంగాణలో అదనంగా 14,565 ఇంజినీరింగ్‌ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. 


సీట్ల కేటాయింపులో కంప్యూట‌ర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల్లో 94.20 శాతం సీట్లు భ‌ర్తీ కాగా, ఎల‌క్ట్రానిక్స్, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 78.70 శాతం, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 44.09 శాతం, ఇత‌ర ఇంజినీరింగ్ కోర్సుల్లో 63.03 శాతం సీట్లు భ‌ర్తీ అయ్యాయి.


రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..


➥ జులై 24 – జులై 25: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్రమే).


➥ జులై 23: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌.


➥ జులై 24 – జులై 27: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.


➥ జులై 27: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.


➥ జులై 31: సీట్ల కేటాయింపు.


➥ జులై 31 – ఆగస్టు 2 వరకు: సీట్లు పొందిన విద్యార్థులు ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..


➥ ఆగ‌స్టు 4: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్రమే).


➥ ఆగ‌స్టు 5: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు స‌ర్టిఫికెట్ వెరిఫికష‌న్‌. 


➥ ఆగ‌స్టు 4 - ఆగ‌స్టు 6 వరకు: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.


➥ ఆగ‌స్టు 6: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.


➥ ఆగ‌స్టు 9: సీట్ల కేటాయింపు.


➥ ఆగ‌స్టు 9 – ఆగ‌స్టు 11: సీట్లు పొందిన విద్యార్థులు ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


స్పాట్ ప్రవేశాలు...
స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను ఆగస్టు 10 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial