TG EAPCET Results | హైదరాబాద్‌: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాల (EAPCET Results)ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం (మే 11న) విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 2,20,326 మంది రిజస్టర్ చేసుకోగా 2,07,190 మంది హాజరు కాగా.. 1,51,779 మంది క్వాలిఫై అయ్యారు. అమ్మాయిలు 73.88 శాతం, అబ్బాయిలు 72.79 శాతం క్వాలిఫై కాగా, ఓవరాల్ ఉత్తీర్ణత శాతం 73.26 శాతం నమోదైంది.

Continues below advertisement

ఇంజినీరింగ్ విభాగంలో టాప్ 10 ర్యాంకులు అబ్బాయిలే సొంతం చేసుకున్నారు. అయితే ఏపీకి చెందిన విద్యార్థి టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. టాప్ 3 ర్యాంకులూ ఏపీ విద్యార్థులను వరించాయి. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పల్లా భరత్‌చంద్రకు ఫస్ట్ ర్యాంకు, నంద్యాల జిల్లా వాసి ఉడగండ్ల రామ్‌చరణ్‌రెడ్డికి రెండో ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన సూర్యకార్తీక్‌ మూడో ర్యాంకు సాధించారు.

హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన ఎం లక్ష్మీభార్గవ్‌కు 4వ ర్యాంకు, మంత్రిరెడ్డి వెంకట గణేశ్‌ రాయల్‌ (హైదరాబాద్)కు 5వ ర్యాంకు, సుంకర సాయి రిశాంత్‌రెడ్డి (హైదరాబాద్) 6వ ర్యాంకు, రష్మిత్‌ బండారి (హైదరాబాద్) 7వ ర్యాంకు, బనిబ్రత మాజీ (బడంగ్‌పేట్‌)కు 8వ ర్యాంకు, కొత్త ధనుష్‌రెడ్డి (హైదరాబాద్‌)కు 9 ర్యాంక్, కొమ్మ కార్తీక్‌ (మేడ్చల్‌)కు 10వ ర్యాంకు వచ్చినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Continues below advertisement

అగ్రికల్చర్‌-ఫార్మసీ ఫలితాలు..టీజీ ఎప్‌సెట్‌ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. అగ్రికల్చర్‌- ఫార్మా ఫలితాల్లో మొత్తం 87.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 86762 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, వీరిలో 81198 మంది పరీక్షకు హాజరుకాగా, 71309 మంది ఉత్తీర్ణత సాధించారు.

మేడ్చల్‌కు చెందిన సాకేత్‌రెడ్డి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. కరీంనగర్‌కు చెందిన సబ్బాని లలిత్‌ వరేణ్యకు రెండో ర్యాంకు, వరంగల్‌కు చెందిన అక్షిత్‌కు 3వ ర్యాంకు, సాయినాథ్‌ (వనపర్తి జిల్లా కొత్తకోట)కు 4వ ర్యాంకు, బ్రాహ్మణి (మాదాపూర్‌)కి 5వ ర్యాంకు, గుమ్మడిదల తేజస్‌ (కూకట్‌పల్లి)కు 6వ ర్యాంకు, అఖిరా నందన్‌రెడ్డి (నిజాంపేట)కు 7వ ర్యాంకు, భానుప్రకాష్ రెడ్డి (సరూర్‌నగర్‌)కి 8వ ర్యాంకు, శామ్యూల్‌ సాత్విక్‌ (హైదర్‌గూడ)కు 9వ ర్యాంకు, అద్దుల శశికరణ్‌ రెడ్డి (బాలాపూర్‌)కి 10వ ర్యాంకు సాధించారు.