New Rules for Teacher Recruitment: కళాశాల విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ నియాకాలకు సంబంధించి అర్హతల్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) మార్పులు చేసింది. ఇకపై 9 నుంచి 12వ తరగతుల వరకు బోధించాలనుకునే టీచర్లకు 'టెట్' తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు 1 నుంచి 8వ తరగతుల బోధనకు టెట్ తప్పనిసరిగా ఉంది. ఎన్‌సీటీఈ తాజా నిర్ణయంలో 9వ తరగతి నుంచి 12 వరకు బోధనకు కూడా టెట్ తప్పనిసరికానుంది. ఈ నిర్ణయం 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. మొదట ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో అమలుచేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రాలు కూడా ఇవే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 


జాతీయ విద్యావిధానం(NEP)-2020లో సంస్కరణలపై ఎన్‌సీటీఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగిన జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. నూతన విద్యావిధానంలో సంస్కరణలపై అవసరమైన సంస్కరణల గురించి చర్చించడానికి మేధోమథనం సెషన్ జరిగింది. ఈ సందర్భంగా టీచర్ రిక్రూట్‌మెంట్ కోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఎన్‌సీటీఈ ప్రతిపాదనల ప్రకారం.. ఫిబ్రవరి 12న టెట్‌పై జరిగిన జాతీయ సదస్సులో చర్చించినట్లుగా, సెకండరీ స్థాయిలో (9 నుండి 12వ తరగతి వరకు) టెట్‌ను తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది. 


ఈ సదస్సులో పాల్గొన్న NCTE సభ్య కార్యదర్శి కేసంగ్ వై. షెర్పా మాట్లాడుతూ.. వివిధ స్థాయిల్లో టెట్‌ను అమలు చేయాలని నూతన విద్యావిధానం 2020 సిఫార్సు చేసిందని, దీనికనుగుణంగా సెకండరీ స్థాయిలోనూ 'టెట్‌'ను అమలు దిశగా ఎన్‌సీటీఈ పనిచేస్తోందని తెలిపారు. 


ఇక CBSE ఛైర్‌పర్సన్ నిధి చిబ్బార్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సామర్థ్యం, తరగతి గదిలో సమర్థమంతమైన వాతవరణాన్ని సృష్టిస్తుందని తెలిపారు. కాబట్టి ఉపాధ్యాయుల సామర్థ్యాలను అంచనావేయడంలో టెట్ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు.


NCTE ఛైర్ పర్సన్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ మాట్లాడుతూ.. విద్య అనేది వ్యక్తిగక్తితంగా అవగాహనను పెంపొందించుకుంటుందన్నారు. విద్యార్థులు మార్కులపై దృష్టి సారించే బదులు, భారతీయ నీతి, విలువలను పెంపొందించడంపై దృష్టి పెట్టాలని ఉద్ఘాటించారు.