Telangana Polycet 2024 Results: తెలంగాణలో పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'TS POLYCET 2024' ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం (జూన్ 3న) మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు/ ఫోన్ నెంబరు/ హాల్‌టికెట్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


పాలిసెట్ పరీక్ష ఫలితాల్లో మొత్తం 84.20 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 69,728  మంది అర్హత సాధించారు. ఎంపీసీ విభాగంలో 84.20 శాతం, ఎమ్ బైపీసీలో 82.48 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పాలిసెట్ పరీక్షకు 46,319 మంది బాలురు హాజరుకాగా.. 37,269 మంది (80.47 శాతం) అర్హత సాధించారు. ఇక 36,496 మంది బాలికలు పరీక్షకు హాజరుకాగా.. 32,459 మంది (88.94 శాతం) అర్హత సాధించారు.  


పాలిసెట్ ఫలితాల కోసం  క్లిక్ చేయండి.. 


పాలిసెట్ ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి.. 


ఈ ఏడాది మే 24న పాలిసెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష పూర్తయిన 10 రోజుల్లోనే ఫలితాలు వెల్లడించడం విశేషం. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 92,808 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 82,809 (89.23శాతం) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పాలిసెట్ ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్‌, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్ క‌ళాశాల్లో చ‌దువుకునే వీలుంది. అగ్రిక‌ల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాల‌జీ, ఆర్గానిక్ అగ్రిక‌ల్చర్ కోర్సుల‌ను ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ యూనివ‌ర్సిటీ, శ్రీ కొండా ల‌క్ష్మణ్ తెలంగాణ స్టేట్ యూనివ‌ర్సీటీలు అందిస్తున్నాయి.


వేర్వేరుగా ర్యాంకుల ప్రకటన..
పాలిసెట్‌ ఫలితాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను తయారు చేస్తారు. టెక్నికల్‌ పాలిటెక్నిక్, అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి, కౌన్సెలింగ్ ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.


అర్హత మార్కులు..
➥ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి) అంటే 36 మార్కులు.
➥ వ్యవసాయ పాలిటెక్నిక్స్, వెటర్నరీ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం (60/2), బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి) అంటే, 36 మార్కులు త‌ప్పనిసరిగా స్కోర్ చేయాలి.


జూన్ 30 నుంచి పాలిసెట్ మొదటి విడత కౌన్సెలింగ్..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 20 నుంచి పాలిసెట్  కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు జూన్ 20 నుంచి 24 వరకు రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి జూన్ 22 నుంచి 25 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జూన్ 22 నుంచి 27 మధ్య వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ల నమోదు ప్రక్రియ పూర్తిచేసివారికి జూన్ 30న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు జూన్ 30 నుంచి జులై 4 మధ్య సంబంధిత కళాశాలల్లో నిర్ణీత ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


జులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్..
మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందలేకపోయినవారు, కౌన్సెలింగ్‌లో పాల్గొనలేకపోయినవారికి జులై 7 నుంచి 16 మధ్య రెండో విడత పాలిసెట్ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. వీరికి జులై 9 నుంచి వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 13న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు జులై 16లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక కన్వీనర్ ద్వారా ఇంటర్నల్ స్లైడింగ్‌ చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌ అవకాశం కల్పించనున్నారు. జులై 24లోపు సీట్లను కేటాయించి.. జులై 23న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.  


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..