TS Inter Results: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలు వారంరోజుల్లోపే వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా.. నమోదైన మార్కుల పరిశీలన జరుగుతోంది. ఇదిపూర్తవడానికి నాలుగైదురోజుల సమయం పట్టనుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఏప్రిల్ 23 లేదా 24న ఫలితాలను వెల్లడించనున్నారు. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఒకవైపు పరీక్షలు జరుగుతుండగానే.. మరోవైపు మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో మూల్యాంకన ప్రక్రియను నిర్వహించి ఏప్రిల్‌ 10న పూర్తి చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష రాసిన వారు, గైర్హాజరైన వారు, మాల్‌ ప్రాక్టీసింగ్‌కు పాల్పడిన విద్యార్థుల డేటాను ప్రస్తుతం అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్‌ 21 నాటికే ముగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇది పూర్తవగానే ఒకేసారి ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో ఈసీ నుంచి అనుమతి తీసుకోనున్నట్లు సమాచారం.


దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా.. ఈసారి ఇంటర్ పరీక్షల మూల్యాంకాన్ని త్వరగా పూర్తిచేసి, ఫలితాలను కూడా త్వరగా విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రయత్నిస్తోంది.  రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. 4,78,527 మంది మొద‌టి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో మూల్యాంకన ప్రక్రియను నిర్వహించి ఏప్రిల్ 10 నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేశారు.


జవాబు పత్రాల మూల్యాంకనంలో సిబ్బంది ఎలాంటి తప్పులు చేయవద్దని ఇంటర్ బోర్డు మూల్యాంకన సమయంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా.. ఈసారి ఎలాంటి వాటికి అవకాశం ఇవ్వొద్దని సూచించింది. పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా జవాబు పత్రాలను పరిశీలించిన తర్వాతే.. మార్కులను ఎంట్రీ చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. వాల్యూయేషన్ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. ఈసారి కొత్తగా సంగారెడ్డి జిల్లాలోనూ వాల్యూయేషన్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా చూస్తే గత ఏడాదితో పోల్చితే.. ఈసారి సాధ్యమైనంత త్వరగా ఫలితాల విడుదల ప్రక్రియను పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఏప్రిల్ 20 తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు.


ఫలితాలు ఇలా చూసుకోవచ్చు..



  • ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- (tsbie.cgg.gov.in)

  • అక్కడ హోంపేజీలో 'TSBIE 2024 result' లింక్ మీద క్లిక్ చేయాలి.

  • విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేయాలి.

  • కంప్యూటర్ స్క్రీన్ మీద ఫలితాలు కనిపిస్తాయి.

  • ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. 


ALSO READ:


తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, టైమ్‌టేబుల్ ఇలా
తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ పేరు, జిల్లా, స్కూల్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మే 3 నుంచి 10 వరకు ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 
హాల్‌టికెట్లు, పరీక్షల టైమ్ టేబుల్ కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...