తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవు విషయంపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సెలవు రోజును మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా అక్టోబర్ 25న దీపావళి సెలవును ప్రకటించింది ప్రభుత్వం. తాజాగా ఆ సెలవులను అక్టోబర్ 24 సోమవారానికి మార్చింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో సెలవు విషయంలో ఏర్పడిన గందరగోళానికి చెక్ పడింది.


ముందుగా అక్టోబరు 24న దీపావళి సెలవును ప్రభుత్వం ప్రకటించింది.  అయితే.. పండితులు మాత్రం సోమవారమే దీపావళి అంటూ ప్రకటించారు. దీంతో పండుగ ఒకరోజు.. సెలవు మరొక రోజు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి సెలవులు మార్చాలని వినతులు అందాయి. దీంతో ఆయా వినతులను పరిగణలోకి తీసుకున్న కేసీఆర్ సర్కార్ సెలవు రోజును మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు ఉత్తర్వులను జారీ చేసింది.


సెలవు సోమవారానికి మార్చడంతో ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజుల పాటు విద్యార్థులకు సెలవులు రానున్నాయి. అయితే.. 15 రోజుల దసరా సెలవుల అనంతరం ఈ నెల 10వ తేదీనే విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అయ్యాయి. గతంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం దాదాపు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. 




పండితులు కూడా 24వ తేదీనే జరుపుకోవాలని తేల్చి చెబుతున్నారు. పంచాంగాల్లో కూడా ఇదే విషయం పొందుపరిచి ఉందని స్పష్టం చేశారు. నిజానికి ఈనెల 25న మంగళవారం అమావాస్యగా క్యాలెండర్లలో ఉంది. సాధారణంగా ఆశ్వయుజమాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ నిర్వ హించుకోవటం ఆనవాయితీ. క్యాలెండర్లలో 25వ తేదీనే అమావాస్య ఉండటంతో పండుగ అదే రోజు ఉంటుందన్న భావన జనంలో వ్యక్తమైంది. కానీ, పంచాంగాలు మాత్రం, 25న కాదు, 24వ తేదీనే దీపావళి అని స్పష్టం చేస్తున్నాయి. 

తేదీ మార్పునకు కారణమిదే..!
దీపావళిని ప్రదోష వేళ నిర్వహించటం ఆనవాయితీ, అంటే సూర్యాస్తమయ సమయంలో నిర్వహిస్తారు. 25న మంగళవారం అమావాస్య తిథి ఉన్నా.. ప్రదోషవేళ(సూర్యాస్తమయం) వచ్చేసరికి పాడ్యమి ఘడియలు వచ్చాయి. ఆరోజు సాయంత్రం 4.25 కల్లా అమావాస్య ముగిసి పాడ్యమి వచ్చేసింది. సూర్యాస్తమయానికి అమావాస్య లేదు. 24న సోమవారం సాయంత్రం 4.25 సమయానికి అమావాస్య ప్రారంభమవుతోంది.

సూర్యాస్తమయానికి అమావాస్య ఘడియలే ఉన్నందున 24న సాయంత్రాన్ని అమావాస్యగా పరిగణించి అదే రోజు దీపావాళి నిర్వహించుకోవాలని పండితులు పేర్కొంటున్నారు. అదే రోజు ధనలక్ష్మి పూజలు కూడా నిర్వహించాలని పేర్కొంటున్నారు. చాలామందికి దీపావళి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది. సాధారణంగా మధ్యాహ్నం వేళ అమావాస్య ఉన్న సమయంలో కేదారేశ్వర వ్రతం జరుపుతుంటారు.

24న మధ్యాహ్నం అమావాస్య తిథి లేనందున, మరుసటి రో జు వ్రతం జరుపుకోవాలని, కానీ ఆ రోజు సూర్యగ్రహణం ఉన్నందున, గ్రహణం విడిచిన తర్వాత గృహ శుద్ధి చేసి సాయంత్రం వేళ జరుపుకోవాలని కొందరు పండితులు పేర్కొంటున్నారు. కానీ దీపావళి రోజునే ఆ వ్రతాన్ని ఆచరించే పద్ధతి ఉన్నందున, అమావాస్య మధ్యాహ్నం లేన్పటికీ 24వ తేదీనే వ్రతం చేసుకోవాలని కొందరు పేర్కొంటున్నారు. ఈ విషయంలో కొంత భిన్నాభిప్రాయాలున్నాయి.