ఏపీలో ఏప్రిల్ 20 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా 'సమ్మెటివ్‌-2' పరీక్షల సమయాలను మార్పు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల  విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.


మార్చిన సమయం ప్రకారం 1 - 8 తరగతులకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తొమ్మిదో తరగతికి ఉదయం 8 గంటల నుంచి 11.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం మధ్యాహ్న భోజనం పెట్టి, విద్యార్థులను పంపిస్తారు. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 20 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..


➥ ఏప్రిల్ 20, 24, 25 తేదీల్లో 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.  


➥ ఏప్రిల్ 26న 3, 4, 5 తరగతులకు పర్యావరణ శాస్త్రం పరీక్ష నిర్వహించనున్నారు. 


➥ ఏప్రిల్ 20, 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో 6, 8వ తరగతుల విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. 


➥ అదేవిధంగా ఏప్రిల్ 20, 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో 7, 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 


➥  పదోతరగతి పరీక్షల మాదిరిగానే 9వ తరగతికి విద్యార్థులకు కూడా 6 పేపర్ల విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.


ఏప్రిల్ 30 నుంచి వేసవి సెలవులు..
రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు ఏప్రిల్ 30 నుంచి వేసవి సెలవులు ప్రకటించనున్నారు. కొత్త విద్యాసంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. మొత్తానికి ఏపీ పాఠ‌శాల‌ విద్యార్థులకు సుమారు 45 రోజులు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.



Also Read:


నవోదయ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
2023-24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే పరీక్షకు అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 29న జరిగే ఈ పరీక్షకు జనవరి 31వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.  ఈ పరీక్షకు గడువు సమీపిస్తున్న వేళ తాజాగా హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష ఏప్రిల్‌ 29న ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫలితాలను జూన్‌లోపు విడుదల చేసే అవకాశం ఉంది. అడ్మిట్‌ కార్డులు పొందాలంటే విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 
పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


సిల్వర్ సెట్‌-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సిల్వర్ సెట్-2023' పరీక్షకు ఏప్రిల్ 7న ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షను మే 25న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తుకు అర్హులు.ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విద్యా బోధనతో పాటు భోజనం, వసతి అందిస్తారు. ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశ పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..