ఆంధ్రప్రదేశ్‌లోని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సెలవులు ఖరారుచేసింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సంక్రాంతి సెలవులు ఇచ్చారు.  రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు సెక్రటరీ శేషగిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలు తిరిగి జనవరి 18న పున:ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. సెలవురోజుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


ఏపీలో జూనియర్ కాలేజీలకు 6 రోజులపాటు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఇక తెలంగాణలో మాత్రం కేవలం 3 రోజులు (భోగి, సంక్రాంతి, కనుమ) మాత్రమే సెలవులు మంజూరుచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు జనవరి 14 నుంచి 16 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ఇచ్చింది. తిరిగి జనవరి 17న తరగతులు పునః ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి సెక్రెటరీ నవీన్‌ మిట్టల్‌ ఆదేశాలు జారీ చేశారు. సెలవుల్లో జూనియర్ కాలేజీల్లో తరగతులు నిర్వహించొద్దని ఆదేశించారు. ఎక్కడైనా తరగతులు నిర్వహించినట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.


తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇలా..


ఏపీలోని పాఠశాలలకు జ‌న‌వ‌రి 12 నుంచి 18 వరకు.. ఏడు రోజులపాటు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. పాఠశాలలు తిరిగి జనవరి 19న ప్రారంభంకానున్నాయి. మొదట జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని భావించినప్పటికీ.. ఉపాధ్యాయ సంఘాల నుంచి దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సంక్రాంతి సెలవులు కేవలం ఆరు రోజులు మాత్రమే ఇచ్చారని, ఇవి సరిపోవని, ముఖ్యంగా 16న కనుమ పండుగ తర్వాత రోజునే స్కూళ్లకు, కాలేజీలకు రావాలంటే సొంత గ్రామాకు వెళ్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతో ఇబ్బంది అవుతుందని తెలిపాయి. కనీసం 18వ తేదీ వరకు సెలవులు పొడిగించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.


తెలంగాణలో పాఠశాలలకు, కాలేజీలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. పాఠశాలలకు 5 రోజులపాటు సెలవులు ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజుల సంక్రాంతి సెలవులు ఇచ్చారు. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ ఉండగా.. జనవరి 17న కూడా సెలవురోజుగా ప్రకటించారు. దీంతో జనవరి 18న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయి.  


ఆర్జీయూకేటీలకు 12 రోజుల సెలవులు..
ఏపీలోని ఆర్టీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు జనవరి 7న ప్రారంభంకాగా 18 వరకు కొనసాగనున్నాయి. అంటే మొత్తం 12 రోజులపాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 19 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. 


Also Read:


AP Inter Practicals: ఫిబ్రవరిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్‌? త్వరలోనే కొత్త షెడ్యూలు!
ఏపీలో ఇంటర్ విద్యార్థుల ప్రాక్టికల్‌ పరీక్షల షెడ్యూల్‌ మారనుంది. థియరీ పరీక్షలకన్నా ముందే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌15 నుంచి మే10 వరకు రెండు విడతలుగా ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే మే వరకు ప్రాక్టికల్స్‌ ఉండటంతో ఎంసెట్‌ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్‌ మార్చాలని కళశాలల యాజమాన్యాల నుంచి ఇంటర్‌ బోర్డుకు విజ్ఞప్తులు అందాయి. దీంతో థియరీ ఎగ్జామ్స్‌కు ముందే ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..