TG LAWCET Answer Key: తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'టీజీ లాసెట్ - 2024' పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీని ఉస్మానియా యూనివర్సిటీ జూన్‌ 6 విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ కీని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఆన్సర్ కీతోపాటు ప్రశ్నపత్రం, రెస్పాన్స్ షీట్లను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే తెలిపేందుకు జూన్‌ 7న సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్‌ కీ రూపొందించి, వెనువెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు. 


           Question Papers with Answers       |    Response Sheets      |   Key Objections


లాసెట్‌, పీజీఎల్‌సెట్ లో వచ్చిన ర్యాంకు ద్వారా రాష్ట్రంలోని న్యాయ కాలేజీల్లో న్యాయవిద్యలో ప్రవేశాలు కల్పిస్తారు. గతేడాది మూడేళ్లు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ (LLB)తో పాటు ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సుల్లో దాదాపు 8 వేల సీట్లు ఉండగా.. వీటిలో కన్వీనర్‌ కోటా సీట్లు మొత్తం 6,894 వరకు ఉన్నాయి. ఈసారి కూడా దాదాపు అన్నే సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇందులో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి సంబంధించి రాష్ట్రంలోని 22 కళాశాలల్లో 4,790 సీట్లు; ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీకి సంబంధించి రాష్ట్రంలోని 19 కళాశాలల్లో 2,280 సీట్లు; రెండేళ్ల పీజీ లాడిగ్రీకి సంబంధించి రాష్ట్రంలోని 17 కళాశాలల్లో  మొత్తం 930 సీట్లు ఉన్నాయి.  


రాష్ట్రంలోని లా కాలేజీల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ జూన్‌ 3న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్ 3న ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు సెషన్‌-1 పరీక్ష , మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు సెషన్‌-2 పరీక్ష, సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు సెషన్‌-3 పరీక్ష నిర్వహించారు. టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలు తొలి రెండు సెషన్లు కలిపి మొత్తం 68 కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో 64 కేంద్రాలు తెలంగాణలో, 4 కేంద్రాలు ఏపీలో ఉన్నాయి. ఇక మూడో సెషన్‌ పరీక్షలను మొత్తం 50 కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో 46 కేంద్రాలను తెలంగాణలో, 4 కేంద్రాలను ఏపీలో ఏర్పాటు చేశారు. 


ఈ ఏడాది టీఎస్‌లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షల కోసం మొత్తం 50,684 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో టీఆఎస్‌ లాసెట్‌ మూడేళ్ల కోర్సు కోసం 36,079 మంది, ఐదేళ్ల కోర్సు కోసం 10,197 మంది, ఎల్‌ఎల్‌ఎం పరీక్ష కోసం 4,408 మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా పరీక్షలకు మొత్తం 79.45 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తంగా 50,684 మంది అభ్యర్థులకు గాను.. 40,268 మంది  పరీక్షకు హాజరయ్యారు. 


అర్హత మార్కులు: 


➥ లాసెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 35 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 42 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.

➥ పీజీఎల్‌సెట్‌ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 30 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.


లాసెట్ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..