Colleges can work together: తెలంగాణలోని ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కాలేజీలు ఇకపై ఒక గొడుగు కిందకు వచ్చి పని చేసే అవకాశం రాబోతుంది. వేర్వేరు యాజమాన్యాల కింద ఉన్న ఇంజినీరింగ్ లేదా మేనేజ్‌మెంట్ కళాశాలలను కలిపి ఒకే కళాశాలగా మార్చుకునే వెసులుబాటులోను అఖిల భారత సాంకేతిక విద్యామండలి(AICTE) కల్పించనుంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను ఏఐసీటీఈ త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటికే విడుదల చేసిన ముసాయిదా డ్రాఫ్ట్‌లో విద్యాసంస్థల మిళితం అంశాన్ని ప్రస్తావించింది. 


వేర్వేరు యాజమాన్యాల కింద ఉన్న విద్యా సంస్థలను కలిపి ఓ విద్యా సంస్థగా మార్చుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. గత నిబంధనల వల్ల కొన్ని యాజమాన్యాలు ఎక్కువ సీట్ల కోసం రకరకాల సొసైటీలు/ట్రస్ట్‌లను ఏర్పాటు చేసి కళాశాలలకు అనుమతి తెచ్చుకున్నాయి. నిబంధనల మార్పుతో అలాంటివి ఒకే కళాశాలగా మారనున్నాయి. దానికి తోడు సరిగా నడవని ఇతర యాజమాన్యాల పరిధిలోని కళాశాలలను కూడా మరో యాజమాన్యం కొనుగోలు చేసి మిళితం చేసుకోవచ్చు. అయితే ఆ రెండు కళాశాలలు ఒకే పట్టణం లేదా నగరంలో ఉండటం మాత్రం తప్పనిసరి.


మూడేళ్లకోసారి ఇంజినీరింగ్‌ కాలేజీలకు అనుమతులు..
ఇంజినీరింగ్‌ కాలేజీలకు అనుమతుల విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మూడేళ్లకోసారి కాలేజీలకు అనుమతులివ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకు వార్షిక ప్రాతిపదికన కాలేజీలకు అనుమతులు మంజూరుచేయగా.. ఈ విధానాన్ని ఏఐసీటీఈ వెనక్కుతీసుకుంది. 2024 -27 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్‌ కాలేజీల అప్రూవల్‌ హ్యాండ్‌బుక్‌ (AICTE Approval Handbook)ను ఏఐసీటీఈ ఇటీవల విడుదల చేసింది. 2024 విద్యాసంవత్సరం నుంచి ప్రతి మూడేళ్లకోసారి ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులివ్వనున్నట్లు తెలిపింది. బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (బీసీఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ) కోర్సులు అందించే కాలేజీలు ఏఐసీటీఈ నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలని అధికారులు సూచించారు. ఇక యూజీ ఇంజినీరింగ్‌, టెక్నాలజీ ప్రోగ్రాముల్లో ఫ్యాకల్టీ, స్టూడెంట్‌ రేషియోను 1: 15 నుంచి 1 : 20కి పెంచినట్టు వారు వివరించారు.


ఏఐసీటీఈ పరిధిలోకి బీసీఏ, బీబీఏ, బీబీఎం కోర్సులు..
దేశంలోని విద్యాసంస్థల్లో ఇకపై బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(BCA), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(BBM) కోర్సులకు వచ్చే విద్యాసంవత్సరం (2024-25) నుంచి ఏఐసీటీఈ అనుమతులు తప్పనిసరి కానున్నాయి. ఈ మేరకు ఏఐసీటీఈ తన ముసాయిదా నివేదికలో స్పష్టం చేసింది. దీనిపై నవంబరు 17లోపు అభిప్రాయాలు పంపాలని కోరింది. ఇందుకు సంబంధించిన తుది నిబంధనలపై వచ్చే ఏడాది మార్చిలో హ్యాండ్‌బుక్‌ను విడుదల చేయనున్నారు. 


ఇప్పటివరకు బీసీఏ, బీబీఏ, బీబీఎం కోర్సులకు యూజీసీ (UGC) నిబంధనలకు అనుగుణంగా.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతులిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయా విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) జారీ చేస్తాయి. ఇక నుంచి పాలిటెక్నిక్ డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ తరహాలోనే బీసీఏ, బీబీఏ, బీబీఎం కోర్సులకు ఏఐసీటీఈ నుంచి అనుమతులు పొందాలి. ఏఐసీటీఈ నిబంధనలనే పాటించాలి.టెక్నికల్, మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన ప్రమాణాలను అనుగుణంగా ఆయా కోర్సులకు కొత్త సిలబస్‌ను కూడా రూపొందించనున్నారు. త్వరలో దానిపై నిపుణుల కమిటీని నియమించనున్నారు. ఇప్పటివరకు ప్రతి సంవత్సరం అనుమతులు పొందాల్సి ఉండేది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మూడేళ్లపాటు అనుమతి ఇస్తారు. యూజీసీ, ఏఐసీటీఈ తదితర నియంత్రిత సంస్థలను మిళితం చేసి భారత ఉన్నత విద్యా కమిషన్(హెకీ)గా మార్చాలన్న ప్రతిపాదనపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఇకపై మూడేళ్లకు అనుమతులు ఇవ్వనున్నారని నిపుణులు చెబుతున్నారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...