NEET UG 2022 Answer Key : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2022) ఆన్సర్ కీని ఆదివారం విడుదల చేసే అవకాశం ఉంది. NTA సోర్సెస్ ప్రకారం NEET UG 2022 ఆన్సర్ కీని జులై ఆఖరులోగా విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో ఆన్సర్ కీని చెక్ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్సర్ కీతో పాటు OMR షీట్లను కూడా పొందవచ్చు.  నీట్ అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నీట్ ఆన్సర్ కీ neet.nta.nic.in వెబ్‌సైట్ లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.


NEET UG 2022 ఆన్సర్ కీ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు



  • neet.nta.nic.in వెబ్‌సైట్‌ పై క్లిక్ చేయండి. 

  • ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి

  • అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి

  • NEET UG 2022 ఆన్సర్ కీ PDF ఫైల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది

  • NEET UG 2022 ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి.


NEET UG 2022 ఆన్సర్ కీ అభ్యంతరాల విండో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు రూ. 1,000 చెల్లించి ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలపవచ్చు. NEET UG 2022 ఫలితాలు ఆగస్టులో ప్రకటిస్తారు. ఈ ఏడాది నీట్‌ పరీక్షకు హాజరు శాతం 95 శాతం ఉంది. జులై 17న జరిగిన మెడికల్ ఎంట్రన్స్‌కు 18 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశానికి NEET పరీక్షను నిర్వహిస్తున్నారు.  


లక్ష ర్యాంక్ వచ్చినా సీట్ 


దేశంలో అత్యధికంగా ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో తమిళనాడు 10,725 సీట్లతో తొలిస్థానంలో ఉండగా, ఆ తర్వాత కర్ణాటకలో 10,145 సీట్లు ఉన్నాయి. మహారాష్ట్రలో 9,895 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 9,053 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో 5,040 సీట్లున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.


మరో 8 కాలేజీలకు తెలంగాణ నిర్ణయం


వచ్చే వైద్య విద్యా సంవత్సరంలో తెలంగాణలో కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి, మంచిర్యాల, మహబూబాబాద్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూలు, రామగుండం జిల్లాల్లో కొత్త కాలేజీలు రానున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే మరో 1,200 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా వస్తాయి. అయితే జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఈ సీట్లకు అనుమతి ఇస్తున్నట్లు తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.  


దేశవ్యాప్తంగా 91,927 ఎంబీబీఎస్‌ సీట్లు


ఇటీవల నిర్వహించిన నీట్‌– 2022 పరీక్ష ఫలితాలు త్వరలోనే రానున్నాయి. ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులు ఎక్కడెక్కడ కాలేజీలున్నాయి.. తమకు వచ్చే ర్యాంకు ప్రకారం ఏ కాలేజీలో సీటు వస్తుందనే దానిపై గతేడాది లెక్కల ప్రకారం అంచనాలు వేస్తున్నారు. కాగా, కేంద్ర ఆరోగ్య శాఖ తాజా నివేదిక ప్రకారం ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌ సీట్లు గణనీయంగా పెరిగాయి. 2017–18 లో 67,523 సీట్లుంటే.. ఇప్పుడు ఏకంగా 91,927 సీట్లు అందుబాటు ఉండటం విశేషం. జిప్‌మర్, ఎయిమ్స్‌తోపాటు ఈ సీట్ల సంఖ్యను కేంద్రం ప్రకటించింది. మొత్తం 322 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 48,212 సీట్లుంటే, 290 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 43,915 సీట్లున్నాయి. అంటే ప్రైవేట్‌లో కంటే ప్రభుత్వ కాలేజీల్లోనే ఎక్కువ సీట్లున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,840 ఎంబీబీఎస్‌ సీట్లుంటే, 23 ప్రైవేట్‌ కాలేజీల్లో 3,200 సీట్లున్నాయని కేంద్రం వెల్లడించింది.  


ఈ సారి కటాఫ్‌ తగ్గే అవకాశం


కేంద్రం ఈ ఏడాది దేశవ్యాప్తంగా కొత్తగా 4,058 పీజీ మెడికల్‌ సీట్లకు అనుమతి ఇవ్వగా, అందులో తెలంగాణలో 279 సీట్లు పెరిగాయి. మరో పక్క ఈసారి నీట్‌ పరీక్ష మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని నిపుణులు అంచనా వేశారు. కాబట్టి గతేడాది కంటే ఈసారి పది మార్కుల వరకు కటాఫ్‌ మార్కులు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. 2020 నీట్‌లో జనరల్‌ కటాఫ్‌ 147, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్‌ 113 మార్కులకు ఉంది.2021 నీట్‌లో జనరల్‌ కటాఫ్‌ 138, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్‌ 108గా ఉంది. ఈసారి జనరల్‌ కటాఫ్‌ 125–130 మధ్య, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్‌ 100 వరకు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్ష ర్యాంకు వరకు వచ్చినా కూడా మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీటు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.