NEET PG 2024 Exam: దేశంలోని మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్దేశించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (NEET PG) పరీక్ష తేదీ వెలువడింది. ఈ మేరకు 'నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ (NBEMS)' జనవరి 9న ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం ఈ ఏడాది జులై 7న నీట్ పీజీ (NEET PG-2024) ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఇక పీజీ అర్హత సాధించడానికి కటాఫ్ గడువును ఆగస్టు 15గా నిర్ణయించారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది మార్చి 3న దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష నిర్వహించాల్సి ఉంది.


గతేడాది మార్చి 5న నీట్ పీజీ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది కూడా మార్చి 3 లేదా 5 తేదీల్లో నిర్వహించే అవకాశమున్నట్లు అందరూ భావించారు. దీనికి అనుగుణంగా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. అయితే తాజాగా నీట్ పీజీ పరీక్ష తేదీని వాయిదావేస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రకటించింది. దీంతో జులై 7న పరీక్ష జరుగనుంది.  కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ 2023 ఆధారంగా నీట్ పీజీ పరీక్షల తరువాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. గత ఏడాదే ఈ రెగ్యులేషన్స్‌ను అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సమగ్ర వివరాల కోసం విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విజ్ఞప్తి చేసింది.



దేశంలోని మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'నీట్‌ పీజీ-2024' పరీక్షను జులై మొదటి వారంలో నిర్వహించి, ఆగస్టు మొదటి వారంలో పీజీ కౌన్సెలింగ్‌  జరగనుందని సంబంధిత వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్ (NEXT)ను ఈ ఏడాది నిర్వహించడం లేదని తెలిపాయి. 2018 పీజీ వైద్య విద్య నిబంధనలను సవరించి ఇటీవల నోటిఫై చేసిన పీజీ వైద్య విద్య నిబంధనలు-2023 ప్రకారం.. నీట్‌ పీజీ పరీక్ష జరగనుంది. పీజీ ప్రవేశాలకు నెక్స్ట్‌ అమల్లోకి వచ్చే వరకూ కొత్త నిబంధనల ప్రకారం నీట్‌ పీజీ జరగనుంది. ఈ ఏడాది జరిగే నీట్​ పీజీ పరీక్షతో.. 19953 ఎండీ, 10821 ఎంఎస్​, 1979 పీజీ డిప్లొమా, 1338 డీఎన్​బీ సీఈటీ సీట్లను భర్తీ చేస్తారు.


ఎన్​ఈటీ అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుత నీట్ పీజీ పరీక్షలు 
పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్జ్యుకేషన్ (సవరణ) రెగ్యులేషన్స్ 2018 స్థానంలో.. ఇటీవలే నోటిఫై అయిన "పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్జ్యుకేషన్ రెగ్యులేషన్స్, 2023" ప్రకారం, పీజీ అడ్మిషన్ కోసం ప్రతిపాదిత ఎన్​ఈటీ అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుత నీట్-పీజీ పరీక్ష కొనసాగుతుంది. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 ప్రకారం.. వివిధ ఎండీ/ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఒకే ప్రవేశ పరీక్షగా నిర్దేశించిన ఎలిజిబిలిటీ కమ్ ర్యాంకింగ్ పరీక్ష ఈ నీట్-పీజీ. ఈ నీట్​ పీజీ కోసం వైద్య విద్యార్థులు తీవ్రంగా కృషి చేస్తారు. ఇందులో మంచి ర్యాంక్​ వస్తే టాప్​ మెడికల్​ కాలేజీల్లో చదువుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు నీటీ పీజీ 2024కి సంబంధించి నోటిఫికేషన్​ త్వరలోనే వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గతేడాది జనవరి 7నే.. నీట్​ పీజీ 2023 నోటిఫికేషన్​ బయటకు రావడం ఇందుకు కారణం. రిజిస్ట్రేషన్​కి సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే బయటకి వస్తాయని సమాచారం. 


మొత్తం ఆన్‌లైన్ ద్వారానే..
దేశంలోని మెడికల్ కాలేజీల్లో పీజీ ప్రవేశాలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ కీలక మార్గదర్శకాలు (NMC Guidelines) జారీ చేసింది. వీటి ప్రకారం.. దేశంలోని ఏ వైద్య కళాశాల కూడా సొంతంగా విద్యార్థులను చేర్చుకోవడం కుదరదు. కోర్సుకు సంబంధించిన ఫీజును ముందే తెలపాలి. అప్పుడే ఆ సీటు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో ఉంటుంది. లేకపోతే ఆ సీటు రద్దవుతుంది. అన్ని మెడికల్ ఇన్‌స్టిట్యూట్లలోని పీజీ ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందులో సంబంధిత ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్.. ఇటీవల వెలువరించిన పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య విద్య నియంత్రణలు-2023 లో స్పష్టం చేసింది. రాష్ట్ర లేదా కేంద్ర కౌన్సెలింగ్ అథారిటీ ద్వారానే అన్ని సీట్లకు అన్ని రౌండ్ల కౌన్సెలింగ్ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. సొంతంగా ఏ వైద్య కళాశాల/సంస్థ విద్యార్థులను చేర్చుకోకూడదు. సంబంధిత కోర్సు ఫీజులు ముందుగానే వైద్య కళాశాలలు తెలిపాలి. లేకపోతే ఆ సీటును లెక్కలోకి తీసుకోరు అని ఎన్ ఎంసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
పూర్తిమార్గదర్శకాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...