National Medical Commission instructions on MBBS Seats: దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను పూర్తిగా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారానే భర్తీ చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఆదేశించింది. ఈ మేరకు తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. ఎంబీబీఎస్ సీట్లను కౌన్సెలింగ్ ద్వారా కాకుండా ఏ వైద్య కళాశాలలోనూ నేరుగా ఒక్క సీటును కూడా భర్తీ చేయడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తే వైద్య కళాశాలలు భారీ మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని, దీంతో పాటు సీట్లను సైతం కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.


మొదటిసారి నేరుగా ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేస్తే రూ.కోటి లేదా కోర్సు పూర్తయ్యేందుకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అంత మొత్తాన్ని కళాశాల జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. రెండోసారి నేరుగా ప్రవేశం కల్పిస్తే రూ.రెండు కోట్లు లేదా కోర్సు పూర్తయ్యేందుకు చెల్లించే ఫీజుకు రెండింతలు.. వీటిలో ఏది ఎక్కువైతే అంత మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. మూడోసారి కూడా ఇలాగే వ్యవహరిస్తే ప్రవేశాలు పొందిన విద్యార్థుల అడ్మిషన్ రద్దు చేయడంతోపాటు ఆయా కళాశాలలు ఎంత మందికి ప్రవేశాలు కల్పిస్తే అందుకు రెట్టింపు సంఖ్యలో సీట్లలో కోత విధించనున్నట్లు ఎన్‌ఎంసీ వివరించింది.


జాబితాలోని విద్యార్థులకే రిజిస్ట్రేషన్‌కు అవకాశం..
2023-24 విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు 2023 నవంబరు 21 చివరి తేదీ అని ఎన్‌ఎంసీ తెలిపింది. ఆ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 1,04,891 మంది విద్యార్థులు కోర్సులో చేరినట్లు వారి వివరాలు కళాశాలలు అప్‌లోడ్ చేశాయని వెల్లడించింది. ఆ జాబితాలోని విద్యార్థులకు మాత్రమే ప్రాక్టిస్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. 2023-24లోనూ అన్ని ఎంబీబీఎస్ సీట్లను విధిగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య మండళ్లను ఎన్‌ఎంసీ ఆదేశించింది. దీనికి విరుద్ధంగా అడ్మిషన్లు కల్పించి ఉంటే.. వాటిని ఏ దశలోనైనా రద్దు చేయనున్నట్లు తాజాగా స్పష్టం చేసింది.


ALSO READ:


ఆన్‌లైన్ ద్వారానే పీజీ మెడికల్ సీట్ల భర్తీ, 'ఫీజు' చెబితేనే సీటు పరిగణనలోకి 
దేశంలోని మెడికల్ కాలేజీల్లో పీజీ ప్రవేశాలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ కీలక మార్గదర్శకాలు (NMC Guidelines) జారీ చేసింది. వీటి ప్రకారం.. దేశంలోని ఏ వైద్య కళాశాల కూడా సొంతంగా విద్యార్థులను చేర్చుకోవడం కుదరదు. కోర్సుకు సంబంధించిన ఫీజును ముందే తెలపాలి. అప్పుడే ఆ సీటు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో ఉంటుంది. లేకపోతే ఆ సీటు రద్దవుతుంది. అన్ని మెడికల్ ఇన్‌స్టిట్యూట్లలోని పీజీ ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందులో సంబంధిత ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్.. ఇటీవల వెలువరించిన పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య విద్య నియంత్రణలు-2023 లో స్పష్టం చేసింది. రాష్ట్ర లేదా కేంద్ర కౌన్సెలింగ్ అథారిటీ ద్వారానే అన్ని సీట్లకు అన్ని రౌండ్ల కౌన్సెలింగ్ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. సొంతంగా ఏ వైద్య కళాశాల/సంస్థ విద్యార్థులను చేర్చుకోకూడదు. సంబంధిత కోర్సు ఫీజులు ముందుగానే వైద్య కళాశాలలు తెలిపాలి. లేకపోతే ఆ సీటును లెక్కలోకి తీసుకోరు అని ఎన్ ఎంసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...