మూడు టీ20ల సిరీస్‌(T20 Series)లో భాగంగా నేడు మొహాలీ వేదికగా అఫ్గానిస్తాన్‌( Afghanistan)తో తొలిమ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కంటే ముందు భారత్‌ ఆడనున్న చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్‌ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 14 నెలల విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి వచ్చిన రోహిత్‌ శర్మ(Rohit Sharma), విరాట్‌ కోహ్లీ(Virat Kohli)పై అందరి దృష్టి నెలకొంది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌(T20 World Cup)కు ముందు చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌, అఫ్గానిస్తాన్‌ నేడు మొహాలీ వేదికగా తొలిమ్యాచ్‌లో తలపడనున్నాయి. 14 నెలల విరామం తర్వాత సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌కోహ్లీ తిరిగి టీ20 జట్టులోకి రావడంతో అందరి దృష్టివారిపైనే నెలకొంది.

 

ఈ సిరీస్‌కు వారిని ఎంపిక చేయడం ద్వారా టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టులో వారు ఉంటారని సెలక్టర్లు సంకేతాలు ఇచ్చారు. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు హర్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియాకు దూరమయ్యారు. రోహిత్‌ శర్మతోకలిసి భారత ఇన్నింగ్స్‌ను శుభమన్‌ గిల్‌ లేదా యశస్వీ జైశ్వాల్‌ ఆరంభించే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనలో పెద్దగా రాణించని శుభమన్‌ గిల్‌ అఫ్గానిస్తాన్‌పై సత్తా చాటడం ద్వారా తిరిగి గాడిలో పడాలని కోరుకుంటున్నాడు. మిడిల్‌ఆర్డర్‌లో రింకూ సింగ్‌ కీలకంకానున్నాడు. వికెట్‌కీపర్‌గా జితేశ్‌ శర్మకు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కింద శివమ్‌ దుబే, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ల కింద అక్షర్‌పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ జట్టుకు అందుబాటులో ఉన్నారు. అర్షదీప్‌, అవేశ్‌ఖాన్‌, ముఖేష్‌ కుమార్‌ పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలను పంచుకోనున్నారు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా కులదీప్‌ యాదవ్‌ లేదా రవిబిష్ణోయ్‌కు తుదిజట్టులో స్థానం దక్కవచ్చు.

 

తక్కువ అంచనా వేస్తే కష్టమే...

మరోవైపు అఫ్గానిస్తాన్‌ జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కీలక ఆటగాడు, స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ లేకుండా ఆ జట్టు బరిలోకి దిగుతోంది. గత ఏడాది వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్న రషీద్‌ ఖాన్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పెద్ద పెద్ద జట్లను ఓడించి అఫ్గానిస్తాన్‌ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.ఈ టీ20 సిరీస్‌లో భారత్‌పై కూడా సత్తా చాటాలని అఫ్గాన్ జట్టు కోరుకుంటోంది. మ్యాచ్‌ గురువారం రాత్రి 7 గంటలకు ఆరంభంకానుంది.

 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ 

 

అఫ్గానిస్థాన్‌ జట్టు: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), హజ్రతుల్లా జజాయ్, ఇక్రమ్ అలీఖిల్, నజీబుల్లా జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, మహ్మద్ నబీ, రహ్మత్ షాహ్, షరఫుద్దీన్ అష్రాఖ్, ఫజ్రీద్ అష్రాఖ్, షరఫుద్దీన్ అష్రాఖ్ మహ్మద్ సలీమ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, నూర్ అహ్మద్, కైస్ అహ్మద్