Karimnagar News : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఎప్పటి నుంచో టీచర్ల కొరతను ఎదుర్కొంటున్నారు. టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ టైం దగ్గర పడుతుండగా మరోవైపు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత సమస్యగా మారింది. ఉపాధ్యాయుల కొరత విద్యార్థులు చదువులపై ప్రభావం చూపుతోంది. ఈ సమస్యని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు జరగకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 651 గవర్నమెంట్ స్కూల్స్ ఉండగా, వాటిల్లో 150 హై స్కూల్స్ ఉన్నాయి. 3,124 పోస్టులుండగా, 457 ఖాళీగా ఉన్నాయి. 3,400 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. మార్చిలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండడంతో ఇప్పటి వరకు జిల్లాలోని పలు పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరతతో పాఠ్యాంశాల బోధన కొరవడింది. విద్యార్థులను చదివించేందుకు కనీసం ప్రత్యేక తరగతులు అయినా నిర్వహించడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. 


పూర్తికాని సర్దుబాటు 


ప్రతి ఏటా సబ్జెక్టు టీచర్ల కొరత తీర్చేందుకు జిల్లా విద్యాశాఖ సర్దుబాటును చేపట్టేది. పక్క జిల్లాలో ఈ ప్రక్రియను పూర్తి చేసినా కరీంనగర్ జిల్లాలో మాత్రం నేటికి పూర్తి కాలేదు. త్వరగా చేపట్టాలని ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్న ఫలితం ఏమిలేదు. సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులు పలు పాఠశాలల్లో టీచింగ్ చేస్తున్నారు. గణితం, భౌతిక శాస్త్రం,సాంఘిక శాస్త్రం సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. వీలైనంత త్వరగా ఈ పరిస్థితిని చక్కదిద్దితే విద్యార్థులు గట్టెక్కి అవకాశం ఉందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని ఎక్కువ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మధ్యమాలు కొనసాగుతున్నాయి. మరి కొన్నింట్లో అదనంగా ఉర్దూ మాధ్యమం కూడా ఉంది. 6 తరగతి నుంచి 10 తరగతిలో 10 సెక్షన్లు ఉంటున్నాయి. ఇలాంటి మెజారిటీ పాఠశాలలో సబ్జెక్టుకు ఇద్దరు టీచర్లు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. ఫలితంగా అన్ని తరగతులకు ఒక్కరే బోధన చేయడం ఉపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ఉన్నత తరగతుల బోధన విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపుపై వారు సరైన దృష్టి నిలపడం లేదు.


సబ్జెక్టు టీచర్ల కొరత 


సబ్జెక్టు టీచర్లు కొరత గత పాఠశాలలో సర్దుబాటుపై ఉపాధ్యాయులను నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం లోని జడ్పీ హైస్కూల్లో హిందీ టీచర్ పోస్టు ఖాళీగా ఉంది. వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు హిందీ బోధించాల్సిన దుస్థితి నెలకొంది. గంగాధర మండలం మల్లాపూర్ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ పోస్టు ఖాళీగా ఉంది. గణిత ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు కొంత మేరకు సబ్జెక్టును బోధిస్తున్నారు. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ ఖాళీలు  ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ గణితం 31 పోస్తులు , ఫిజికల్ సైన్స్ 12 పోస్టులు, జీవశాస్త్రం 37 పోస్టులు, సాంఘిక శాస్త్రం 56 పోస్టులు, ఇంగ్లీష్ 21 పోస్టులు, తెలుగు 24 పోస్టులు, హిందీ 17 పోస్టులు, ఉర్దూ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి త్వరగా పోస్టులను భర్తీ చేస్తే రానున్న పరీక్షల్లో ఆయా పాఠశాలల పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉందని తల్లిదండ్రులు అంటున్నారు.