JNTU Hyderabad Letter Ro AICTE: తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి కంప్యూటర్ సైన్స్, ఐటీ తదితర సీట్ల సంఖ్య భారీగా పెరగడంపై జేఎన్‌టీయూ హైదారబాద్ (JNTUH) ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలను తగ్గిస్తూ.. సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత విభాగాల్లో సీట్లను విపరీతంగా పెంచడం మంచిది కాదని తెలిపింది. ఇది భవిష్యత్తులో తీవ్ర విపరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు ఏఐసీటీఈకి జేఎన్‌టీయూహెచ్ గురువారం (జులై 4న) లేఖ రాసింది. సీట్లు పెంచితే అధ్యాపకుల కొరత తలెత్తుతుందని లేఖలో పేర్కొంది. ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచన మేరకు జేఎన్‌టీయూ వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్ రావు ఈ లేఖ రాశారు.


వర్సిటీ లేఖపై కళాశాలల యాజమాన్యాలు షాక్..
రాష్ట్రంలో కొత్త కళాశాలలు, సీట్ల పెంపుకు సంబంధించిన అనుమతుల విధివిధానాలపై ఏఐసీటీఈ గత జనవరిలోనే హ్యాండ్ బుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అపరిమిత సీట్లు మంజూరు చేస్తామని అందులో స్పష్టం చేసింది. ఆ మేరకు సీట్లపెంపుకు దరఖాస్తు చేసుకున్న కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూహెచ్ వర్సిటీ ఏఐసీటీఈకి లేఖ రాయడంపై కళాశాలల యాజమాన్యాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అనుమతుల ప్రక్రియ అంతా పూర్తయ్యాక లేఖ రాయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. 


కొత్తగా 20,500 ఇంజినీరింగ్ సీట్లు..
రాష్ట్రంలో ఒకపక్క ఇంజినీరింగ్ కాలేజీల సంఖ్య భారీగా పెరగ్గా.. ఆ మేరకు సీట్ల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. ముఖ్యంగా డిమాండ్‌ ఉన్న కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో ఏకంగా 20,500 సీట్లు పెరగనున్నాయి. అయితే పెరగిని ఈ సీట్లు కేవలం జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని కళాశాలల్లోనివి మాత్రమే కావడం గమనార్హం. ఇక ఉస్మానియా యూనివర్సిటీ (OU) కాకతీయ యూనివర్సిటీల్లో(KU) కలిపితే సీట్ల సంఖ్య మరింత పెరుగుతాయి.


జులై 8 నుంచి వెబ్ఆప్షన్ల ఎంపిక..
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 4న ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థులు జులై 12 వరకు నిర్ణీత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది. వీరికి జులై 6 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినవారు కళాశాలలు, బ్రాంచ్‌ల ఎంపిక కోసం జులై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వీరికి జులై 19న మొదటి దశ ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు జులై 19 నుంచి 23 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే జులై 8 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో జేఎన్‌టీయూహెచ్ పరిధిలో దాదాపు 88 వేల సీట్లకు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఇతర కోర్ బ్రాంచ్‌లలో సుమారు 7 వేల సీట్లను కుదించుకొని సీఎస్‌ఈ తదితర డిమాండ్ ఉన్న బ్రాంచీల్లో సీట్ల సంఖ్య పెంచుకున్నట్లు తెలుస్తోంది. 


గతేడాది ఇలా..
బీటెక్ కోర్సుల్లో చేరేవారు మొదటి ఛాయిస్‌గా కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సులనే ఎంచుకుంటున్నారు. దీంతో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో కన్వీనర్‌ కోటా సీట్లు సగం కూడా నిండలేదు. గతేడాది మూడు కోర్‌ బ్రాంచీల్లో 12,751 సీట్లుండగా.. అందులో కేవలం 5,838 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక మేనేజ్‌మెంట్ కోటాలో చేరే వారే కరవయ్యారు. ఆ సీట్లను కూడా కలిపితే మొత్తం సీట్ల భర్తీ 40 శాతానికి మించదు. 


ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..