'జగనన్న విదేశీ విద్యా దీవెన' పథకానికి సంబంధించి నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులు విదేశీ విద్య అభ్యసించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులు ఈ స్కీం ద్వారా లబ్ధి పొందుతున్నారు. 


ఈ పథకంలో లబ్ధి పొందిన పేద విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్‌ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యనభ్యసించే వీలు కల్పిస్తుంది ప్రభుత్వం. వారి చదువుకు కావాల్సిన డబ్బును 'జగనన్న విదేశీ విద్యా దీవెన' ద్వారా సమకూరుస్తుంది. దీనికి సంబంధించిన నిధులనే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ బటనొక్కి ప్రారంభించారు.


'జగనన్న విదేశీ విద్యా దీవెన' పథకం కింద ఈ సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో టాప్‌-200 వర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వాళ్ల చదువుల కోసం మొదటి విడతలో సాయంగా రూ. 19.95 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి వారి వారి ఖాతాల్లో జమ చేశారు. 


200ల వర్సిటీల్లో ఆడ్మిషన్లు పొందిన 213మంది విద్యార్థులకు ఆర్థికసాయం


జగనన్న విదేశీ విద్యా దీవెన ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేద విద్యార్థులకు ప్రపంచంలోనే టాప్‌ యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించామని తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి ఒక్క చదువేనని అభిప్రాయపడ్డారు. అలాంటి చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్నారు జగన్. అలాంటి పేదలు 213 మంది విద్యార్థులు విదేశీ యూనివర్శిటీల్లో అ‍డ్మిషన్లు పొందారని వాళ్లకు సమస్య రాకూడదని వీరందరికి తొలివిడతగా రూ.19.95 కోట్ల సాయం అందిస్తున్నామన్నారు. తమ చదువు ద్వారా ప్రపంచ వేదికపై దేశం, ఆంధ్రప్రదేశ్ జెండా ఎగురవేయాలని లబ్ధిదారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్రానికి చెందిన ఈ పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాక్షించారు. 


విద్యతో రాష్ట్రంలోని అందరి తలరాతలు మారుతుంది: సీఎం జగన్


పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని..విద్య మీద పెట్టే ప్రతి పెట్టుబడి కూడా మానవ వనరుల మీద పెట్టినట్టేనని సీఎం జగన్ తెలిపారు. చదువు కుటుంబాల తలరాతలే కాదు.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలరాతలు కూడా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, అంబేద్కర్‌ వంటి వాళ్లు పెద్ద యూనివర్శిటీల నుంచి వచ్చినవారేనని గుర్తు చేశారు. అందుకే పేద పిల్లలు చదువుకునేలా అడుగులు వేయిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. 


గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ. 10లక్షలు మాత్రమే ఇచ్చేవారని.. 2016-17లో రూ.300 కోట్లు బకాయిలు పెట్టారని సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు, మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ.కోటి వరకు సాయం అందిస్తున్నామని తెలిపారు. ట్యూషన్‌ ఫీజు వందశాతం రీయింబర్స్‌మెంట్స్‌ ఇస్తున్నామన్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే సీఎంఓలో అధికారులు అందుబాటులో ఉంటారని,  ప్రతీ విషయంలో మీకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.