Andhra Pradesh Schools Holiday : వాతావరణ శాఖ తెలుగు ప్రజల గుండెల్లో మరో బాంబు పేల్చించి. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరోసారి రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మూడు రోజులు కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఐదు జిల్లాలకు, ఎల్లుండి నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది.



హైదరాబాద్ వాసులు జర జాగ్రత్త
నిర్మల్, నల్గొండ, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి,ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇటు హైదరాబాద్‌లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.  దీంతోపాటు హైదరాబాద్ వాసులు ఏ క్షణమైనా ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ లో వరద నీటిని మూసీలోకి వదిలారు. దీంతో నది పరిసర ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.



 
మున్నేరు విలయతాండవం 
ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు విలయతాండవం చేసింది. పరివాహక ప్రాంతాలను ముంచేసింది. భారీ వరదలతో మహబూబాబాద్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. మరోసారి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఖమ్మంలో వరదలు కారణంగా పాఠశాలలకు ఐదు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. రేపు అంటే సోమవారం కూడా ఖమ్మంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పాటుగా మున్నేరుకు మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం స్కూళ్లకి సెలవు ప్రకటించారు. కాగా మున్నేరు పరివాహక ప్రాంతంలోని ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని, ఖమ్మం రూరల్ మండలంలోని అన్ని విద్యాసంస్థలకు ఆ జిల్లా కలెక్టర్ రేపు సెలవు ప్రకటించారు.జిల్లాలోని మిగిలిన మండలాలలోని విద్యాసంస్థలు రేపటి నుండి యధావిధిగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. 


 


ఏపీలో జోరందుకున్న వానలు
ఏపీలో మళ్లీ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రేపు అంటే సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అంబేద్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా సోమవారం ఇతర జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే  శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాలకు సోమవారం సెలవు ప్రకటిస్తూ  కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.


రానున్న 24 గంటల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబరు 8వ తేదీ ఉదయం 08.30 గంటలకు కళింగపట్నానికి తూర్పున 280 కి.మీ, గోపాలపూర్ (ఒడిశా)కి తూర్పు ఆగ్నేయంగా 230 కి.మీ., పరదీప్ (ఒడిశా)కి 260 కి.మీ. దక్షిణ-ఆగ్నేయంగా, తుఫాను దీఘా (పశ్చిమ బెంగాల్)కి దక్షిణంగా 390 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం దాదాపు ఉత్తరం వైపుగా ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదులుతుందని, రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. సెప్టెంబరు 9 సాయంత్రం లేదా రాత్రి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఒడిశాలోని పూరీ, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఉన్న దిఘా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. కాకినాడ, గంగవరం, కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.