డిప్లొమా పాలిటెక్నిక్ కోర్సులను రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ పరిధిలోకి తీసుకొస్తూ తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా ఫీజులను ఏఎఫ్‌ఆర్‌సీ ఖారారు చేయనుంది. డిప్లొమా కోర్సులను ఏఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి తేవాలని సాంకేతిక విద్యాశాఖ గతేడాది ప్రతిపాదించింది. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు  విద్యాశాఖ జీవో నెం 41 జారీ చేసింది.


తెలంగాణలో డిప్లొమా కోర్సులకు సంబంధించి ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు జూన్ 16న ఆదేశించిన సంగతి తెలిసిందే. డిప్లొమా కోర్సులను ఏఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి తేవాలని గతేడాది ఫిబ్రవరిలో సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదనలు పంపగా.. దీనిపై ప్రభుత్వం అప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రారంభమైనందున ఫీజులు పెంచాలని హైకోర్టులో 5 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలు పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ విద్యాశాఖ కార్యదర్శి స్పందించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ అంశంపై వారం రోజుల్లోగా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. విద్యాశాఖ కార్యదర్శి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించింది. 


పాలిటెక్నిక్ కాలేజీలు కోరినట్లుగా ఫీజుల పెంపునకు అనుమతించక తప్పడం లేదని పేర్కొంది. డిప్లొమా కోర్సుల ఫీజును రూ.40వేలకు పెంచేందుకు 5 పాలిటెక్నిక్ కాలేజీలకు అనుమతిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించింది. ప్రభుత్వం తక్కువగా ఫీజు ఖరారు చేస్తే అదనంగా చెల్లించిన సొమ్మును విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని కాలేజీలకు హైకోర్టు షరతు విధించింది. దీంతో డిప్లొమా పాలిటెక్నిక్ కోర్సులను రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ పరిధిలోకి తీసుకొస్తూ తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.  


ALSO READ:


తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష! ఐఐటీ కౌన్సిల్‌లో నిర్ణయం!
జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్‌(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌‌కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్‌, జేఈఈ మెయిన్‌ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షనూ తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఐఐటీ కౌన్సిల్‌, ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ప్రధానంగా ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ఐఐటీ కౌన్సిల్‌ దృష్టి పెట్టింది. డ్రాపౌట్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి  నివేదికను ఇవ్వాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కౌన్సిల్‌ ఆదేశించింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్‌ మీటింగ్‌కు సంబంధించిన  తీర్మానాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial