Vyooham Movie: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాలు తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాలను తీస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ రెండు సినిమాల్లో మొదట ‘వ్యూహం’ ను బరిలో దించనున్నాడు ఆర్జీవి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ లు అందరి దృష్టినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ ను తీసుకొచ్చాడు ఆర్జీవి. మూవీలోని పవన్ కళ్యాణ్, చిరంజీవి ల లుక్ ను రివీల్ చేశాడు. ఈ మేరకు ఓ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు ఆర్జీవి. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. 


స్పీడ్ పెంచుతోన్న ఆర్జీవి..


రామ్ గోపాల్ వర్మ ఈ ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాలు అనౌన్స్ చేసిన దగ్గరనుంచీ స్పీడ్ పెంచాడు. ముందుగా ‘వ్యూహం’ సినిమాను విడుదల చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ మూవీ గురించి వరుసగా అప్డేట్ లు ఇస్తూ వస్తున్నాడు. గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఫోటోలలో వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి అలాగే ఇతర కుటుంబ సభ్యుల పాత్రలను పరిచయం చేశాడు. తర్వాత మూవీకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశాడు. ఈ టీజర్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడం, ఆ వార్తను తట్టుకోలేక ఎంతో మంది వైఎస్ అభిమానులు చనిపోవడం, రాత్రికి రాత్రి రాజకీయాలు మారిపోవడం, జగన్ పై కేసులు, ఆయన కొత్త పార్టీ ఇలా అన్నీ ఎపిసోడ్ లు గురించి చెప్తూ టీజర్ ను కట్ చేశారు. ఈ టీజర్ కూడా ఆకట్టుకుందనే చెప్పాలి. తాజాగా ఇప్పుడు మూవీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల పాత్రలను కూడా పరిచయం చేశాడు. ఈ మేరకు ఓ ఫోటోను రిలీజ్ చేశాడు. అందులో పవన్ చిరంజీవితో ఏదో మాట్లాడి తిరిగి వెళ్లిపోతున్నట్టుగా తెలుస్తోంది. మరి మూవీలో ఈ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.


పొలిటికల్ ఎజెండాతోనే ‘వ్యూహం’ తీస్తున్నారా?


రామ్ గోపాల్ వర్మ గత ఎన్నికల సమయంలో కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి అంతగా రెస్పాన్స్ రాలేదు. 2019 ఎన్నికల తర్వాత రామ్ గోపాల్ వర్మ పొలిటికల్ సైడ్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపికు అనుకూలంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్న తీరు చూస్తే అది అర్థమవుతుంది. ఈ మధ్య అది ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో పలు సార్లు సీఎం జగన్ తో భేటీ అయ్యాడు ఆర్జీవి. రీసెంట్ గా కూడా కలిశాడు. అయితే వీరు ఏం మాట్లాడుకున్నారు అనేది తెలియలేదు. ఆ తర్వాత కొన్నిరోజులకు ‘వ్యూహం’ మూవీ ట్రైలర్ బయటకొచ్చింది. వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని వైసీపీపై, అలాగే వైఎస్ జగన్ పై ప్రజల్లో పాజిటివిటీ క్రియేట్ చేయడం కోసమే ఈ సినిమాలు తీస్తున్నారనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆర్జీవి నుంచి వచ్చిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడుతున్నాయి. ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్జీవి తెరకెక్కిస్తోన్న ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయా లేదా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారట వైఎస్ అభిమానులు. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే సినిమాలు వచ్చే వరకూ ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో సీఎం జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ కనిపిస్తున్నాడు. మూవీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ మూవీను దాసరి కిరణ్ నిర్మిస్తున్నాడు.


Also Read: వైష్ణవ్ తేజ్ సాహసం - ఆ డిజస్టర్ డైరెక్టర్‌తో మూవీకి గ్రీన్ సిగ్నల్?