తెలంగాణలో పీజీ కోర్సలతోపాటు ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబరు 5న ప్రారంభమైంది. పీజీ ప్రవేశాలకు సంబంధించి తుది విడత కౌన్సెలింగ్; ఎంఈడీ, ఎంపీఈడీ ప్రవేశాలకు సంబంధించి తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. పీజీ ప్రవేశాలకు ఇప్పటివరకు రెండు విడతల కౌన్సెలింగ్ ముగియగా, చివరి విడతలో ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో సీట్ల భర్తీని చేర్చారు.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సీపీగెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం నవంబరు 5 నుంచి 8 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్న అభ్యర్థులు నవంబరు 9 నుంచి 11 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి నవంబరు 15న సీట్లను కేటాయించనున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.250; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.


కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..


➥ సీపీగెట్-2023 అర్హత సాధించిన అభ్యర్థుల ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ (ఎంఈడీ, ఎంపీఈడీతో కలిపి): 05.11.2023 - 08.11.2023.


➥ అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్0 వివరాలు అందుబాటులో


➥ ఈమెయిల్ ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాల్లో సవరణలు: 09.11.2023.


➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 09.11.2023 - 11.11.2023. 


➥ వెబ్ఆప్షన్లలో మార్పులకు అవకాశం: 11.11.2023.


➥ అభ్యర్థుల ప్రొవిజినల్ అలాట్‌మెంట్ జాబితా: 15.11.2023.


➥ సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 18.11.2023.


Counselling Website



సీపీగెట్‌ రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌‌లో భాగంగా అక్టోబరు 23న అధికారులు సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ కౌన్సెలింగ్‌లో 20,743 అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోగా.. 12,244 మంది అభ్యర్థులు సీట్లు దక్కించుకున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 28లోగా ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒరిజినల్‌ టీసీ, సర్టిఫికేట్లతో సంబంధిత కళాశాలలో నేరుగా రిపోర్టింగ్ చేయాలి. మొదటి విడుతలో 14,119 మంది విద్యార్థులు రిపోర్ట్‌ చేయగా.. మొదటి రెండో విడుత కలుపుకుంటే మొత్తంగా 23,920 మంది విద్యార్థులు సీట్లను దక్కించుకున్నారు. వీరిలో 17,327 మంది మహిళలు ఉండటం విశేషం. పురుషులు కేవలం 6,593 సీట్లను మాత్రమే దక్కించుకున్నారు.


సీపీగెట్-2023 పరీక్షలను జూన్‌ 30 నుంచి జూలై 10 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షకు 22,468 మంది పురుషులు, 45,954 మంది మహిళలు సహా మొత్తం 68,422 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష ఫలితాలు ఆగస్టు 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో మొత్తం 93.42 శాతం మంది అర్హత సాధించారు. అందులో 19,435 మంది పురుషులు, 40,230 మంది మహిళలు సహా మొత్తం 59,665 మంది పరీక్షలు రాశారు. వారిలో 18,172 మంది పురుషులు, 37,567 మంది మహిళలు సహా మొత్తం 55,739 మంది క్వాలిఫై అయ్యారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీలతోపాటు హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.


డిగ్రీ ఏదైనా.. పీజీలో నచ్చిన కోర్సు..


➥ రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది ఇంతే సంఖ్యలో సీట్లున్నా, చేరిన వారి సంఖ్య 22,812 మాత్రమే. వీరిలోనూ 16,163 (71%) మహిళలు, 6,649 (29%) పురుషులు చేశారు.


➥ డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆఖరుకు ఎంబీబీఎస్, బీటెక్‌ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్‌ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్‌ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే.


➥ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కోటాను 5% నుంచి 20%కి పెంచారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్‌ న్యూమరరీ పోస్టులు క్రియేట్‌ చేస్తారు. ఆన్‌లైన్, డిస్టెన్స్‌ మోడ్‌లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...