NEET UG Exam 2024: నీట్‌ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా అలజడి కొనసాగుతున్న వేళ ఎగ్జామ్‌ని రీషెడ్యూల్ చేస్తారన్న వార్త వినిపిస్తోంది.  National Board of Examinations అందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశముంది. అయితే...NEET UG Exams ని ఈ సారి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా పేపర్ లీక్‌లను అడ్డుకోవచ్చని యోచిస్తోంది. ఈ ప్రతిపాదనను కొంత మంది నిపుణులు కూడా సమర్థించారు. ఇలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ని ఆన్‌లైన్‌లో నిర్వహించడమే మంచిదని సూచించారు. NEET UG ఎగ్జామ్స్‌ నిర్వహించే బాధ్యత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీదే. అయితే..ఈ సారి పెద్ద ఎత్తున మాల్‌ప్రాక్టీస్‌తో పాటు పేపర్ లీక్‌ వ్యవహారం తెరపైకి రావడం సంచలనం సృష్టించింది. ఈ తరహా అవకతవకలు భవిష్యత్‌లోనూ జరిగే ప్రమాదముందని చాలా మంది వాదిస్తున్నారు. అందుకే..అసలు నీట్‌ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం ఈ వాదనను గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసుని CBI విచారిస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న జర్నలిస్ట్‌ని CBI అధికారులు అరెస్ట్ చేశారు. అటు పార్లమెంట్‌లోనూ నీట్ వ్యవహారం దుమారం రేపుతోంది. 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పూర్తిగా ఈ ఎగ్జామ్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 


MBBS,BDS లాంటి యూజీ కోర్సులు చేసేందుకు లక్షలాది మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్‌ రాస్తారు. యూనివర్సిటీల్లో సీట్‌ రావాలంటే ఈ పరీక్ష తప్పనిసరిగా రాయాల్సిందే. 2017 నుంచి ఈ పరీక్షను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. అయితే..ఇప్పుడు పేపర్ లీక్ వ్యవహారంతో ఆన్‌లైన్‌లో జరపాలన్న చర్చ తెరపైకి వచ్చింది.  CSIR UGC NET ఎగ్జామ్‌ ఈ పాటికే జరగాల్సి ఉన్నా నీట్ వివాదం వల్ల వాయిదా పడింది. జులై 25-27 మధ్యలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక UGC- NET పరీక్ష ఆగస్టు 21- సెప్టెంబర్ 8 మధ్య కాలంలో జరగనుంది. ఈ రెండు టెస్ట్‌లనూ ఆన్‌లైన్‌లోనే జరపనున్నారు. ఐఐటీలు, ఇంజనీరింగ్ కాలేజ్‌లలో అడ్మిషన్స్‌ కోసం నిర్వహించే JEE Mains, JEE Advanced ఎగ్జామ్స్‌ని ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇదే తరహాలో నీట్‌నీ ఏర్పాటు చేయాలని చూస్తోంది.