PM Modi Released Books Of Venkaiah Naidu Life: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) జీవితం స్ఫూర్తిదాయకమని.. ఆయన గ్రామ స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని మోదీ కొనియాడారు. వెంకయ్యనాయుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన 3 పుస్తకాలను పీఎం వర్చువల్‌గా విడుదల చేశారు. హైదరాబాద్ (Hyderabad) గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వెంకయ్యనాయుడు సహా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. '13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం', 'సేవలో వెంకయ్యనాయుడు జీవితం', 'మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం' పుస్తకాలను ప్రధాని మోదీ విడుదల చేశారు. వెంకయ్యనాయుడు జీవితంపై పుస్తకాలు దేశ ప్రజలకు మార్గ నిర్ధేశం చేస్తాయని.. ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. వేలాది మంది కార్యకర్తలు వెంకయ్యనాయుడి నుంచి ఎంతో నేర్చుకున్నారని.. ఆయనతో సుదీర్ఘ కాలం పని చేసే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. అత్యయిక పరిస్థితి వేళ వెంకయ్య పోరాటం చేశారని.. 17 నెలల జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు.






'వాగ్ధాటికి ఎవరూ నిలవలేరు'


'గ్రామీణ, పట్టణాభివృద్ధిలో వెంకయ్యనాయుడు తనదైన ముద్ర వేశారు. స్వచ్ఛభారత్, అమృత్ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారు. ఆయన వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు. రాజ్యసభ ఛైర్మన్‌గా సభను సజావుగా నడిపారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు తొలుత రాజ్యసభ ముందుకు రాగా.. బిల్లు ఆమోదంలో వెంకయ్య పాత్ర కీలకం. ఆయన సేవలను దేశం మరువదు. దీర్ఘకాలం ఆయన ఆరోగ్యంగా ఉండి మార్గనిర్దేశం చేయాలి' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


'మాతృభాషకు ప్రాధాన్యం'


కేంద్ర ప్రభుత్వం మాతృభాషలను ప్రోత్సహించడం గొప్ప విషయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తాను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని.. అయితే మాతృభాష, సోదర భాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలన్నీ భారతీయ భాషల్లోనే ఉండాలని.. ఆ తర్వాత ఆంగ్ల భాషలో ఉండాలని కోరారు. ప్రధాని మోదీ రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ నినాదంతో ముందుకెళ్తున్నారని.. దేశ ప్రజలకు ఆయన సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. అవసరం ఉన్నంత వరకూ ఉచిత రేషన్ పథకం కొనసాగించాలని.. యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు సైతం కొనసాగించాలని కోరారు. చట్ట సభలకు ఎంపికైన వారు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. ఒకవేళ వారి పార్టీ సిద్ధాంతాలు నచ్చకుంటే నాయకులు పార్టీ మారొచ్చని.. దాని ద్వారా వచ్చిన పదవిని వదిలి వెళ్లాలని అన్నారు. 'రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రయత్నించాలి. పాలిటిక్స్‌లో కులం, ధనం ప్రభావం తగ్గిపోవాలి. గుణం చూసి నేతలకు ఓటెయ్యాలి. మార్పు రాకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది.' అని వెంకయ్య పేర్కొన్నారు.


Also Read: PM Modi: మొక్కను నాటండి, అమ్మపై గౌరవాన్ని చాటుకోండి - మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ