సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) 2022ను డిసెంబ‌ర్‌లో నిర్వహించ‌నున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సీబీఎస్ఈ) ప్రక‌టించింది. ఈ మేర‌కు ప‌బ్లిక్ నోటీస్ జారీ చేసింది. ఈ కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కు సంబంధించిన తేదీల‌ను అభ్యర్థుల అడ్మిట్‌ కార్డుల్లో తెలియ‌జేస్తామ‌ని తెలిపింది. ఈ ప‌రీక్షను దేశ‌వ్యాప్తంగా 20 భాష‌ల్లో నిర్వహించ‌నున్నట్లు వెల్లడించింది. ఈ ప‌రీక్షకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నున్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి పాఠ్యాంశాలను బోధించడానికి టీజీటీ, పీఆర్‌టీ ఉద్యోగాల్లో చేరవచ్చు.
పరీక్ష ఫీజు..
జ‌న‌ర‌ల్‌/ ఓబీసీ అభ్యర్థుల‌కు పేప‌ర్-1 లేదా పేప‌ర్-2కు దరఖాస్తు ఫీజు రూ.1000, రెండు పేప‌ర్లకు కలిపి రూ.1200గా నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ అభ్యర్థుల‌కు పేప‌ర్-1 లేదా పేప‌ర్‌-2కు రూ.500, రెండు పేప‌ర్లకు రూ.600గా నిర్ణయించిన‌ట్లు సీబీఎస్ఈ ప్రకటనలో తెలిపింది.
గతేడాది పరీక్ష స్వరూపం ఇలా ..
✦ పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ) 1-5 తరగతులు: మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహించారు. పరీక్షలో మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
✦ పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ) 6-8 తరగతులు: మొత్తం 150 మార్కులకు పేపర్-2 రాతపరీక్ష నిర్వహించారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2.30 గంటలు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.


నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి


వెబ్‌సైట్: https://ctet.nic.in/