హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. గతంలో వివిధ డిగ్రీ కోర్సుల్లో చేరి, కోర్సు పూర్తిచేయలేకపోయిన పాత విద్యార్థులకు మరోఅవకాశం కల్పించింది. విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకోవడానికి ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ డా.ఎల్వీకే రెడ్డి అక్టోబరు 13న ఒక ప్రకటనలో తెలిపారు. 1991-2011 మధ్య డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్పీ) బ్యాచ్‌లకు చెందిన వారికి ఈ అవకాశం ఉంటుందని జూబ్లీహిల్స్‌లోని వర్సిటీ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వివరాలకు పనిదినాల్లో కాల్‌సెంటర్‌ 18005990101 లేదా సహాయ కేంద్రం 7382929570 నంబర్లను సంప్రదించవచ్చని ఆయన సూచించారు.


బీఈడీ స్పాట్ ప్రవేశాలు..
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ప్రవేశపరీక్షలో అర్హత సాధించి, గత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందలేని, కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులు అక్టోబరు 17న వర్సిటీలోని సీఎస్‌టీడీ బిల్డింగ్‌, మినీ ఆడిటోరియంలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు ఉదయం 10.30 గంటలకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఉదయం 11.30 గంటల్లోగా కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాత హాజరైనవారికి అనుమతించరు. స్పాట్ ప్రవేశాలకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఒక జత జిరాక్స్ కాపీలు తీసుకురావాల్సి ఉంటుంది. అదేరోజు ట్యూషన్ ఫీజుగా రూ.40,000 డిడి తీసి సమర్పించాల్సి ఉంటుంది.


డిగ్రీ, పీజీ ప్రవేశాలకు అక్టోబరు 20 వరకు అవకాశం..
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


ఆంధ్రా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ కోర్సులు, ప్రవేశాలు ఇలా
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ 2023-24 విద్యా సంవత్సరానికిగాను మూడేళ్లు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెల్ఫ్‌ సపోర్ట్‌ ప్రోగ్రామ్స్ కింద ఈ సీట్లను భర్తీచేయనున్నారు. ఈ కోర్సులను డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కాలేజ్‌ ఆఫ్‌ లా నిర్వహిస్తుంది. మూడేళ్ల లా డిగ్రీ కోర్సుకు డిగ్రీ అర్హత, అయిదేళ్ల లా డిగ్రీ కోర్సుకు ఇంటర్ అర్హత ఉండాలి. వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


ఓయూలో దూరవిద్య ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో డిగ్రీ, పీడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం ఉందని డైరెక్టర్ ప్రొఫెసర్ బీబీ రెడ్డి తెలిపారు. యూకేపీ ఆదేశాల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అక్టోబరు 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...