APAAR- One Nation One ID: ఒక దేశం ఒకటే ఫోన్ నెంబర్‌, ఒకే దేశం ఒకే ఆధార్ నెంబర్‌, ఒక దేశం ఒకటే రేషన్ కార్డు తరహాలో ఒక దేశం ఒక్కటే అపార్ ఐడీకి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఆధార్ తరహాలో స్కూలు విద్యార్థుల నుంచి యూనివర్శిటీ విద్యార్థులకు ఆపార్‌ పేరిట ఒక ఐడీ ఇవ్వనుంది. తద్వారా నకిలీ సర్టిఫికేట్లకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


ఆపార్ ఐడీ అంటే ఏంటి?


అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ- APAAR. ఈ పేరుతో దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు ఒన్ నేషన్ ఓన్ ఐడీ కింద ఈ నెంబర్‌ను కేటాయించి విద్యార్థులకు గుర్తింపు కార్డును ఇవ్వనుంది. ఇప్పటికే ఈ ఐడీ కార్డుల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్రాల విద్యాశాఖలను కేంద్రం ఆదేశించింది. దసరా సెలవుల్లో ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. మొదటి విడతలో 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు వివరాలు నమోదు చేసుకుంటున్నారు. దసరా సెలవుల్లో పాఠశాలలు ఈ ప్రకియకు తల్లిదండ్రుల నుంచి నిరభ్యంతర పత్రాలపై సంతకాలు కూడా తీసుకుంటున్నారు. జాతీయ విద్యా విధానం- 2020 కింద ఈ అపార్‌ను కేంద్రం తెరమీదకు తెచ్చింది. ఆధార్ వివరాల బహిర్గతానికి చాలా రాష్ట్రాలు అడ్డు చెప్పడంతో కేంద్రం అపార్‌ ఐడీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.


స్కూలు చదువుల నుంచి ఉన్నత చదువుల వరకూ ఒక్కటే నెంబర్‌:


పాఠశాలలో చేరిన సమయంలో విద్యార్థులకు ఈ ఆపార్ నెంబర్‌ను ప్రభుత్వం కేటాయిస్తుంది. ప్రస్తుతం బడుల్లో విద్యార్థుల చేరికలన్నీ ఆధార్ వివరాల ఆధారంగా జరుగుతున్నాయి. దీని ప్రకారం వారికి వారికి యూడైస్‌ ప్లస్‌లో పర్మనెంట్ ఎన్‌రోల్‌మెంట్‌ నెంబర్‌ను కేటాయిస్తున్నారు. ఇప్పుడు దానికి అదనంగా ఈ 12 అంకెల ఆపార్ నంబర్‌ను ఇవ్వనున్నారు. ఇది చదువులు పూర్తయ్యే వరకు ఆధార్ మాదిరి ఒక్కటే నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్‌తోనే ఐడీ కార్డు ఇస్తారు. దీనితో పాటు విద్యార్థి మార్క్‌ లిస్టులు కూడా ఈ నెంబర్ ఆధారంగానే ఉంటాయి. ఈ నెల 14లోపు తల్లిదండ్రులు ఇచ్చిన నిరభ్యంతర పత్రం ఆధారంగా విద్యార్థుల వివరాలు యూడైస్‌ ప్లస్‌లో నమోదు కానున్నాయి.


2022లోనే మొదలైన ఆపార్ ప్రక్రియ:


ఈ ఆపార్ ఐడీ ప్రక్రియ 2022లోనే మొదలైంది. దేశ వ్యాప్తంగా దాదాపు 34 కోట్ల మంది విద్యార్థుల వివరాలు రిజిష్టర్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు 18 లక్షల మంది వరకూ ఉండగా వారి వివరాల నమోదు ప్రక్రియ దసరా సెలవుల తర్వాత మొదలవుతుంది. మొదట వీరికి ఆపార్ ఐడీలు ఇస్తారు. ఆ తర్వాత మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రక్రియలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యాశాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది.


ఆపార్‌తో నకిలీ సర్టిఫికేట్లు అడ్డుకోవచ్చా?


ఆపార్ ప్రధాన ఉద్దేశ్యం నకలీ సర్టిఫికేట్లకు అడ్డుకట్ట వేయడమేనని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆపార్ ఐడీ స్కూల్‌ విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థి వివరాలతో డిజిటల్ సమాచార కేంద్రంగా పనిచేయనుంది. ఈ ఐడీ వచ్చిన తర్వాత విద్యుర్థులకు ఇచ్చే ప్రతి సర్టిఫికేట్‌పై ఆపార్ ఐడీ ఉండనుంది. ఇది సర్టిఫికేట్ల జారీలో పారదర్శకత తీసుకొస్తుందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ముఖ్యంగా ఉద్యోగ నియామకాల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం జరుగుతున్న వ్యయంతో పాటు కాలం కూడా ఆదా అవుతుందని పేర్కొంది. ఉద్యోగార్థులకు ఉద్యోగ నియామకాల్లో జాప్యానికి అడ్డుకట్ట పడుతుందని తెలిపింది.


Also Read:రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !