ఏపీలో ఈ ఏడాది నిర్వహించబోయే పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది లీకేజీ ఘటనల నేపథ్యంలో ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీకైతే వెంటనే గుర్తించేందుకు వీలుగా ఈ ఏడాది ప్రశ్నపత్రాలపై సీరియల్  నంబర్లను ముద్రించారు. జిల్లాల వారీగా పంపించే ప్రశ్నపత్రాల అంకెలను నమోదు చేస్తారు. అక్కడి నుంచి ఏయే కేంద్రాలకు ఏ అంకెలున్నవి సరఫరా చేశారో వాటిని నమోదు చేస్తారు. ఎక్కడైనా ప్రశ్నపత్రం బయటకు వస్తే వెంటనే ఏ కేంద్రం నుంచి బయటకు వచ్చిందో గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. 

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.10 లక్షల మంది రెగ్యులర్, 55వేల మంది ప్రైవేటు విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. 

వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు..
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి వార్షిక పరీక్షల హాల్‌టిక్కెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని వివరాలు నమోదుచేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

ఏపీలో 6 పేపర్లతో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త విధానం ప్రకారం పది పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్‌, ప్రశ్నల వారీగా వెయిటేజీ వివరాలను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది.

మాదిరి పశ్నాపత్రాలు, బ్లూప్రింట్స్ లింక్ కోసం క్లిక్ చేయండి..

పరీక్షల షెడ్యూలు ఇలా..

పరీక్ష తేదీ పేపరు
ఏప్రిల్ 3 ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 8 ఇంగ్లిష్
ఏప్రిల్ 10 మ్యాథమెటిక్స్
ఏప్రిల్ 13 సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ)
ఏప్రిల్ 15 సోషల్ స్టడీస్
ఏప్రిల్ 17 కాంపోజిట్ కోర్సు
ఏప్రిల్ 18 ఒకేషనల్ కోర్సు

విద్యార్థులకు నిబంధనలు..

➥ పరీక్ష కేంద్రాల్లోని సెల్‌ఫోన్తీ సుకెళ్లడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ అబ్జర్వర్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లు సైతం ఎగ్జామ్ సెంటర్లలోకి సెల్ ఫోన్లను తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు అధికారులు. 

➥ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా సెల్‌ఫోన్లను ఎగ్జామ్ సెంటర్లలోకి తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎగ్జామ్ సెంటర్లలోకి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు. 

➥ ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనుండగా.. విద్యార్థులను కేంద్రాల్లోకి ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటల వరకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

➥ విద్యార్థులు ఆన్సర్లు రాసేందుకు 24 పేజీల బుక్‌లెట్‌ను అందించనున్నారు. ఇది నిండిన తర్వాత అడిగే మరో 12 పేజీల బుక్ లెట్ ను అందించనున్నారు. 

➥ సైన్స్ పరీక్షకు 12 పేజీల బుక్ లెట్లు 2 ఇస్తారు. ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు ఒకటి, బయోలజీకి మరో బుక్‌లెట్ ఇవ్వనున్నారు.