AP PGCET: ఏపీ పీజీసెట్-2025 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

AP PGCET: ఏపీలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీసెట్ 2025 దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2న ప్రారంభమైంది.

Continues below advertisement

AP PGCET 2025 Application: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో (PG Courses) ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే 'ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025(AP PGCET)' నోటిఫికేషన్‌ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల మార్చి 31న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2న ప్రారంభమైంది. అభ్యర్థుల నుంచి మే 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక రూ.1000 అపరాధ రుసుముతో మే 15 వరకు, రూ.2000 అపరాధ రుసుముతో మే 20 వరకు, రూ.4000 అపరాధ రుసుముతో మే 24 వరకు, రూ.10,000 అపరాధ రుసుముతో మే 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 09 నుంచి 13 మధ్య ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ పీజీసెట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 16 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. 

Continues below advertisement

పరీక్ష వివరాలు..

➥ ఏపీ పీజీసెట్ - 2025 (Andhra Pradesh Post Graduate Common Entrance Test - 2025)

ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు...
ఆంధ్ర యూనివర్సిటీ (విశాఖపట్నం), డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ (శ్రీకాకుళం), శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి), డా.అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ (కర్నూలు), శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ(అనంతపురం), ద్రవిడియన్ యూనివర్సిటీ (కుప్పం), ఆచార్య నాగార్జన యూనివర్సిటీ (గుంటూరు), కృష్ణా యూనివర్సిటీ (మచిలీపట్నం), శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి), ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ (రాజమహేంద్రవరం), యోగి వేమన యూనివర్సిటీ (కడప), క్లస్టర్ యూనివర్సిటీ (కర్నూలు), రాయలసీమ యూనివర్సిటీ (కర్నూలు), ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ (ఒంగోలు), విక్రమ సింహపురి యూనివర్సిటీ (నెల్లూరు), జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపూర్- ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాస్యూటికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (తిరుపతి).

అర్హత: సంబంధించిన సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా చివరి ఏడాది పరీక్ష రాస్తున్నవారు అర్హులు.

పరీక్ష ఫీజు: జనరల్ కేటగిరీలకు రూ.850; బీసీలకు రూ.750; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.650.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపీఈడీకి రాతపరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85% శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. పీజీసెట్ మూడు కేటగిరీల వారీగా నిర్వహిస్తున్నారు. కేటగిరీ-1లో ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్; కేటగిరీ-2లో కామర్స్ అండ్ ఎడ్యుకేషన్, కేటగిరీ-3లో సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు...

➥ ఏపీ పీజీసెట్-2025 నోటిఫికేషన్ వెల్లడి: 31.03.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 02.04.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేది: 05.05.2025.

➥ రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: 15.05.2025.

➥ రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: 20.05.2025.

➥ రూ.4000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: 24.05.2025.

➥ రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: 25.05.2025.

➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 30.05.2025 నుంచి.

➥ ప్రవేశ పరీక్షలు: 09.06.2025 - 13.06.2025.

పరీక్ష సమయం: ఉ.09:30 - ఉ.11:00,  మ.01:00 - మ.02:30, సా.04:30 - సా.06:00.

➥ ఫలితాల వెల్లడి తేది: తర్వాత ప్రకటిస్తారు.

Notification

Instruction Booklet

Fee Payment for APPGCET - 2025

Application Form for APPGCET - 2025


Additonal Subject fee Payment for APPGCET - 2025

Continues below advertisement