Waqf amendment bill | వక్ఫ్ సవరణ బిల్లు కు మద్దతు తెలిపిన చంద్రబాబు ముస్లిం ద్రోహి అన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించడానికే వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చారని ఇది మైనారిటీలను అణిచివేసే కుట్ర అనీ అన్నారామె. ఇది ఒక రాజ్యాంగ వ్యతిరేక బిల్లు. గా తెలిపిన షర్మిల దేశ వ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతీయడమే మోడీ అజెండా అంటూ ఆరోపించారు. " పార్లమెంట్ ముందుకు సవరణ బిల్లు రావడం అంటే ఈ దేశానికి ఇవ్వాళ బ్లాక్ డే. దేశ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయే ఒక చర్య. ఈ బిల్లు ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా మరొకటి కాదు. వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడం కోసమే ఈ పన్నాగం. దేవుడికి ఇచ్చిన ఆస్తిని కాజేసి మోడీ బినామీలకు, మోడీ దోస్తులకు వక్ఫ్ ఆస్తులను దారాదత్తం చేసే కుట్ర.
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఆందోళనలు చేస్తున్నా.. వారి వేదన వినకుండా బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య. వారి ఆవేదనను పరిగణనలోకి తీసుకోకపోవడం మోడీ నియంతృత్వ విధానానికి నిదర్శనం. వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ కలెక్టర్లకు అప్పగించడం, వక్ఫ్ బోర్డులో అన్యమత సభ్యులను నియమించడం, వక్ఫ్ ఆస్తులు 12 ఏళ్ళుగా ఎవరి అధీనంలో ఉంటే వారివే అనడం, 300 ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు ఇప్పుడు డాక్యుమెంట్ లు అడగడం, వక్ఫ్ బోర్డుకి భూములు వితరణ చేయాలంటే 5 ఏళ్లు ఇస్లాం ధర్మాన్ని ఆచరించాలని నిబంధన పెట్టడం అంటే ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వ్యతిరేక చర్యలే.
మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు టీడీపీ,జనసేన @JaiTDP @JanaSenaParty పార్టీలు మద్దతు పలకడం దారుణం. ఇది అత్యంత శోచనీయం. టీడీపీ సెక్యులర్ పార్టీ ముసుగు తొలిగింది. చంద్రబాబు గారి మోసం బయటపడింది. ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇచ్చి, వక్ఫ్ ఆస్తులను కాపాడుతామని హామీలు ఇచ్చి, మరోపక్క పార్లమెంట్ లో సవరణ బిల్లుకు మద్దతు పలకడం పచ్చి మోసం. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విప్ జారీచేసిన చంద్రబాబు ఒక ముస్లిం ద్రోహి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముస్లింల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం " అంటూ ఆమె తన సోషల్ మీడియా " X " లో పోస్ట్ చేశారు.
చర్చలో పాల్గొంటాం... కానీ ఓటు వ్యతిరేకంగా వేస్తాం: విపక్షాలు
వక్ఫ్ వివాదాలను త్వరగా త్వరగా పరిష్కరించేలా, వాళ్ల భూములు, ఆస్తులకు సంబంధించి ఉన్న నిబంధనలను సరళతరం చేసేలాగా కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొస్తుంది. దీనిపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశం పై పూర్తి చర్చ జరగాలని దానికి 12 గంటల సమయం కావాలని విపక్షాలు స్పీకర్ ను కోరగా ఆయన ఎనిమిది గంటల సమయం కేటాయించారు. ఒకవైపు పార్లమెంట్లో చర్చ జరుపుతూనే మరోవైపు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని అపోజిషన్ పార్టీలు నిర్ణయించాయి. ఈరోజు మధ్యాహ్నం నుండి సుదీర్ఘంగా చర్చ జరగబోతోంది. కూటమిలో భాగస్వాములుగా ఉన్న టిడిపి,జనసేన ఈ బిల్లుకు మద్దతు ఇవ్వగా కాంగ్రెస్ దీనిని వ్యతిరేకిస్తుంది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అని వారి వాదన.