ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ ఫలితాలు బుధవారం (సెప్టెంబర్ 8) ఉదయం 10.30 గంటలకు విడుదల కానున్నాయి. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేస్తారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం అవకుండా మొదట ఎంపీసీ విభాగాల ఫలితాలను రిలీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. అభ్యర్థులు తమ ఫలితాలను sche.ap.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. 


రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు మొత్తం 1.76 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 1,66,460 మంది హాజరయ్యారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో నిర్వహించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో జరిగాయి. కంప్యూటర్‌ ఆధారిత విధానం ద్వారా ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ నెల 18 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.  


ఈఏపీసెట్ ద్వారా ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బీటెక్‌ అగ్రి ఇంజనీరింగ్, బీఎస్సీ (హార్టికల్చర్‌), బీఎస్సీ (అగ్రి), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/ బీఎఫ్‌ఎస్సీ, బీ-ఫార్మసీ, ఫార్మా డీ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున జేఎన్టీయూ కాకినాడ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. 


ఇంట‌ర్ వెయిటేజీ తొల‌గింపు
ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కాలేజీల‌లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ మార్కుల వెయిటేజ్‌ తొల‌గించిన‌ట్లు ఏపీ ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది. గ‌తేడాది వ‌ర‌కు ఈ ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల‌లో విద్యార్థులకు వారి ఇంట‌ర్ మార్కులకు గానూ 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారు. ఈ ఏడాది కోవిడ్ వల్ల ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌ని నేపథ్యంలో వెయిటేజ్ తొలిగిస్తున్నట్లు బోర్డు తెలిపింది. 


ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాల నోటిఫికేషన్ రద్దు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు బ్రేక్ పడింది. ఇంటర్‌ విద్యా మండలి ఆన్‌లైన్ ప్రవేశాల కోసం ఆగస్టు 10న ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. ఈ ఏడాది ప్రవేశాలకు పాత విధానాన్నే అమలుచేయాలని పేర్కొంది. భవిష్యత్తులో ఇంటర్‌ ప్రవేశాలకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కాకూడదని చెప్పింది. ఆన్‌లైన్‌ ప్రవేశాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని ఇంటర్‌ విద్యా మండలికి బదలాయించడం చట్టప్రకారం చెల్లదని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యూ.దుర్గాప్రసాద రావు ఈ మేరకు తీర్పు వెలువరించారు. 


Read More: Inter Online Admissions: ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాల నోటిఫికేషన్ రద్దు... ఏపీ హైకోర్టు కీలక తీర్పు... ఈ ఏడాదికి పాత విధానమే...


Also Read: ANGRAU Admissions 2021: ఏపీ వ్యవసాయ పాలిటెక్సిక్ కోర్సుల్లో ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటివరకు అంటే?